వీడ్కోలుకు ముందు విరాట్ కు క్రేజీ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ.. అక్కర్లేదన్న కోహ్లి.. అలాంటివాన్ని కాదని వ్యాఖ్య
Virat Kohli Quits Test Captaincy: విరాట్ కోహ్లి టెస్టు సారథిగా వైదొలగడానికి కొద్దిగంటల ముందు బీసీసీఐ నుంచి ఒక ఫోన్ వచ్చింది. తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే టెస్టుకు అతడిని...
టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన తర్వాత అంతకుముందు జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనూహ్య నిర్ణయంతో అందరికీ షాకిచ్చిన కోహ్లికి.. కెప్టెన్సీ వదులుకునే నిర్ణయానికి ముందు విరాట్ కోహ్లికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) క్రేజీ ఆఫర్ ఇచ్చిందట..
ఒక సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం..‘టెస్టు కెప్టెన్ గా వైదొలగాలని కోహ్లి నిర్ణయించుకున్న తర్వాత బోర్డుకు సంబంధించిన ఓ వ్యక్తి (పేరు చెప్పలేదు) అతడికి ఫోన్ చేశాడు.
త్వరలో అతడు ఆడబోయే వందో టెస్టుకు సారథిగా ఉండి ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లికి సూచించాడు..’ అని తెలిపాడు. భారత పర్యటనలో భాగంగా.. ఫిబ్రవరి 25-30 మధ్య శ్రీలంక జట్టు టీమిండియాతో తొలి టెస్టు ఆడాల్సి ఉంది.
ఈ టెస్టు బెంగళూరులో జరుగనుంది. కోహ్లి స్వస్థలం ఢిల్లీ అయినా అతడికి బెంగళూరుతో అనుబంధం ఉంది. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడే కోహ్లికి బెంగళూరు సెకండ్ హోమ్ వంటిది. దీంతో అక్కడ ఆడి సారథిగా వైదొలగాలని బీసీసీఐ కోహ్లికి ప్రతిపాదించింది.
కోహ్లికి ఈ టెస్టు వందో టెస్టు కానుంది. తన కెరీర్ లో ఇప్పటివరకు 99 టెస్టులాడిన కోహ్లి.. దక్షిణాఫ్రికాలోనే ఈ ఫీట్ ను సాధిస్తాడని భావించారు. కానీ వాండరర్స్ లో జరిగిన రెండో టెస్టులో కోహ్లి ఆడలేదు.
ఇదిలాఉండగా బీసీసీఐ ప్రతిపాదనను విరాట్ కోహ్లి తిరస్కరించాడట.. ‘ఒక్క మ్యాచుతో తేడా లేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు..’ అంటూ కోహ్లి సదరు అధికారికి తెలిపాడని సమాచారం.
68 టెస్టులలో భారత జట్టుకు సారథ్యం వహించిన కోహ్లి ఏకంగా 40 టెస్టులలో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి నాయకత్వంలో భారత జట్టు 17 టెస్టులలో ఓడింది. భారత్ తరఫున అత్యధిక విజయాలు అందుకున్న సారథిగా కోహ్లికి మంచి రికార్డుంది.
కానీ కెరీర్ లో కెప్టెన్ గా చివరి టెస్టును ఓటమితో ముగించాడు కోహ్లి. కేప్టౌన్ లో జరిగిన టెస్టు (కోహ్లికి ఇది 99వ టెస్టు) లో భారత్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.