విరాట్ ఖాతాలో మరో రికార్డు... సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ‘కింగ్’ కోహ్లీ...
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. 242 ఇన్నింగ్స్ల్లోనే 12 వేల వన్డే పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్గా నిలిచాడు. వన్డేల్లో మెరుపు వేగంతో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ 8 వేల పరుగుల నుంచి 12 వేల మైలురాయి దాకా అత్యంత వేగంగా ఆ ఫీట్ అందుకున్న క్రికెటర్గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ వన్డేల్లో తన మొదటి 6 వేల పరుగులను పూర్తిచేసుకునేందుకు 136 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. అయితే ఆ తర్వాత 106 ఇన్నింగ్స్ల్లోనే మరో 6 వేల పరుగులు చేశాడు.
242 ఇన్నింగ్స్ల్లో 12 వేల మైలురాయి అందుకున్న విరాట్ కోహ్లీ, భారత లెజెండరీ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ అందుకునేందుకు 300 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.
సచిన్ టెండూల్కర్ 2003లో ఈ ఫీట్ అందుకోగా... ఆ తర్వాత సనత్ జయసూర్య 2007లో, రికీ పాంటింగ్ 2009లో, కుమార సంగర్కర 2013లో, మహేల జయవర్థనే 2014లో ఈ మైలురాయి అందుకున్నారు.
అయితే ఎవ్వరూ కూడా సచిన్ రికార్డును చేరుకోలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచిన రికీ పాంటింగ్కి 12 వేల వన్డే పరుగులు పూర్తి చేసుకునేందుకు 314 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. అత్యధికంగా జయవర్థనే 399 ఇన్నింగ్స్ల్లో 12 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు.
వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగుల నుంచి 7000 పరుగుల దాకా పూర్తి చేసుకున్న క్రికెటర్గా నిలిచిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా 8 వేల పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
అయితే 11 వేల పరుగుల మైలురాయి నుంచి 12 వేల పరుగులను చేరుకునేందుకు 20 ఇన్నింగ్స్లు వాడుకున్నాడు విరాట్... ఈ మధ్యకాలంలో ఇదే అత్యధికం.
6 వేల నుంచి 7 వేల మైలురాయి చేరుకునేందుకు 25 ఇన్నింగ్స్లు వాడుకున్న విరాట్ ఆ తర్వాత 14 ఇన్నింగ్స్లో 8 వేలు, 19 ఇన్నింగ్స్ల్లో 9 వేలు, 11 ఇన్నింగ్స్ల్లో 10 వేలు, 17 ఇన్నింగ్స్ల్లో 11 వేల ఫిగర్ను అందుకున్నాడు.
ప్రస్తుత వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాట్స్మెన్గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో భారతీయ క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే.
విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 18,426, కుమార సంగర్కర 14,234, రికీ పాంటింగ్ 13,704, జయసూర్య 13,430, జయవర్థనే 12,650 పరుగులతో ఉన్నారు. అయితే వీరందరి కంటే విరాట్ సగటు చాలా ఎక్కువ.
251 వన్డే మ్యాచల్లో 242 ఇన్నింగ్స్ల్లో 12000 మైలురాయి అందుకున్న విరాట్ కోహ్లీ సగటు 59.43. టాప్ 10 వన్డే క్రికెటర్లలో ఎవ్వరూ 50+ సగటుతో పరుగులు సాధించకపోవడం విశేషం.