విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఏంటో అర్థం కావడం లేదు... వాళ్లని ఎందుకు ఆడించలేదు..
ఆసీస్ టూర్ను వన్డే సిరీస్ను ఓటమితో మొదలెట్టింది భారత జట్టు. బ్యాట్స్మెన్ రాణిస్తున్నా, బౌలర్ల వైఫల్యం భారత జట్టును తెగ వెంటాడుతోంది. అయితే బౌలర్ల కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ కెప్టెన్గా విఫలమయ్యాడనే ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వైఫల్యం భారత జట్టు ఓటమికి కారణమని అంటున్నాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
మొదటి రెండు వన్డేల్లో 300+ స్కోరు చేసింది భారత జట్టు. అయితే ప్రత్యర్థికి భారత బౌలర్లు 370+ స్కోరు అప్పజెప్పారు...
భారత స్టార్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాలు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా బుమ్రా వైఫల్యం భారత జట్టుపై తీవ్రమైన ప్రభావం చూపింది.
‘నాకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఏంటో అస్సలు అర్థం కావడం లేదు... పట్టిష్టమైన బ్యాటింగ్ ఉన్న ఆస్ట్రేలియాను ఎలా నియంత్రించాలో విరాట్ కోహ్లీ ఏ మాత్రం ఐడియా లేనట్టుగా తెలుస్తోంది...
ఆసీస్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవాలంటే మొదటి ఓవర్లలోనే వికెట్లు తీయాలి... కానీ విరాట్ కోహ్లీ మాత్రం బుమ్రా, షమీలతో రెండు ఓవర్లను మాత్రమే వేయిస్తున్నాడు...
వన్డేల్లో ఒక్కో బౌలర్ నుంచి నాలుగేసి ఓవర్లు స్పెల్ వేయిస్తే, మంచి రిజల్ట్ వస్తుంది. కానీ విరాట్ మాత్రం బౌలర్లను మారుస్తున్నాడు... ఇది టీ20 కాదు, విరాట్ వ్యూహం ఆస్ట్రేలియాకి బాగా ఉపయోగపడుతోంది...’ అంటూ విమర్శించాడు గౌతమ్ గంభీర్.
రెండో వన్డేలో మెయిడిన్ ఓవర్తో ఇన్నింగ్స్ ఆరంభించాడు జస్ప్రిత్ బుమ్రా... అయితే అతనితో ఇంకో ఓవర్ మాత్రమే వేయించిన కోహ్లీ, ఆ తర్వాత భారీగా పరుగులు ఇస్తున్న నవ్దీప్ సైనీని తీసుకొచ్చాడు.
బుమ్రా బౌలింగ్లో మొదట్లో ఇబ్బందిపడిన ఆస్ట్రేలియా ఓపెనర్లు, నవ్దీప్ సైనీ బౌలింగ్లో భారీగా పరుగులు రాబట్టారు. సైనీకి ఇవ్వకుండా బుమ్రాతో ఇంకో రెండు ఓవర్లు వేయించి ఉంటే వికెట్లు దక్కి ఉండేవని అభిప్రాయపడ్డాడు గౌతమ్ గంభీర్.
ఆరో బౌలర్ ఆప్షన్ లేకపోవడం కూడా భారత జట్టుకు ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. రెండో వన్డేలో నాలుగు ఓవర్లు వేసిన హార్ధిక్ పాండ్యా, వెన్ను నొప్పితో బాధపడ్డాడు.
ఆల్రౌండర్ కోటాలో ఆస్ట్రేలియా చేరుకున్న వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు వన్డే జట్టులో ఎందుకు చోటు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు గౌతమ్ గంభీర్.
‘భారత జట్టులో ఆల్రౌండర్ల కొరత తీవ్రంగా ఉంది. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే వంటి ఆల్రౌండర్లకు అవకాశం ఇచ్చి చూడాలి. వాళ్లు ఆస్ట్రేలియాలో రాణించలేకపోతే అది సెలక్టర్ల తప్పు అవుతుంది... ’ అంటూ కామెంట్ చేశాడు గంభీర్.
కొంత కాలంగా రోహిత్ శర్మకు మద్ధతు ఇస్తున్న గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ పనికి రాడని, రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు గౌతమ్ గంభీర్.