వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఇంటికి... కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు కేకేఆర్ క్రికెటర్లు...
కోల్కత్తా నైట్రైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని, ఇంటికి చేరారు. ఐపీఎల్ 2021 సీజన్లో మొట్టమొదట కరోనా కలకలం రేగడానికి ఈ ఇద్దరికీ పాజిటివ్ రావడమే కారణం...
లీగ్ ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగిపోతున్న సమయంలో మే 3న వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్కి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా ఐపీఎల్ అభిమానులు, క్రీడాకారులు ఉలిక్కిపడ్డారు.
షెడ్యూల్ ప్రకారం ఆ రోజు జరగాల్సిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఆకస్మాత్తుగా వాయిదా పడింది. ఆ తర్వాత మరిన్ని పాజిటివ్ వెలుగు చూడడంతో ఐపీఎల్ 2021 సీజన్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
‘వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లు 10 రోజుల క్వారంటైన్, ఐసోలేషన్ను పూర్తిచేసుకున్నారు. వారికి ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు. అందుకే వారిని ఇంటికి పంపించాం. కేరళ, తమిళనాడుల్లో మళ్లీ వారికి కరోనా టెస్టు చేయిస్తాం. కొన్నిరోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తుంటాం’ అంటూ తెలిపారు బీసీసీఐ అధికారులు.
మెడికల్ స్కానింగ్ కోసం బయటికి వెళ్లివచ్చిన తర్వాత క్వారంటైన్లో లేకుండానే జట్టుతో కలిసిన వరుణ్ చక్రవర్తి, ఐపీఎల్లో కరోనా పాజిటివ్గా తేలిన మొదటి ప్లేయర్.
వరుణ్ చక్రవర్తితో సన్నిహితంగా ఉన్న ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ వారియర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత సందీప్ వారియర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అమిత్ మిశ్రాను కలిసి మాట్లాడాడు. దాంతో అతనికి కూడా పాజిటివ్గా తేలింది...
తమిళనాడు రాష్ట్రానికి చెందిన వరుణ్ చక్రవర్తి, కేరళకు చెందిన సందీప్ వారియర్ ఇంటికి చేరగా కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, రెండు రోజుల క్రితమే పాజిటివ్గా తేలడంతో అతను ఇంకా ఐసోలేషన్లో గడుపుతున్నాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్కి స్టాండ్బై ప్లేయర్గా ఎంపికైన ప్రసిద్ధ్ కృష్ణ... కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొన్నిరోజులు కుటుంబంతో గడిపి మే 25న తిరిగి బయోబబుల్లోకి రానున్నాడు.
వీరితో పాటు కేకేఆర్ బృందంలోని న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సిఫర్ట్ కూడా కరోనా పాజిటివ్గా తేలాడు. టిమ్ కూడా ప్రస్తుతం ఐసోలేషన్లోనే గడుపుతున్నాడు.