రెండో టీ20కి ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి ఎంట్రీ..? హర్షల్ పటేల్ కు చోటు డౌటే..?
IND vs SA: ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా ఢిల్లీ లో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఓటమికి కారణమైన బౌలింగ్ యూనిట్ లో మార్పులు జరుగనున్నాయి..
ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టీ20 లో భారీ స్కోరు చేసినా టీమిండియా ఓడింది. బౌలర్ల వైఫల్యం కారణంగానే మ్యాచ్ చేజారినట్టు కెప్టెన్ రిషభ్ పంత్ కూడా వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20కి జట్టులో రెండు మార్పులు తప్పవని తెలుస్తున్నది.
Harshal Patel
డెత్ ఓవర్లలో రాణిస్తాడని పేరున్న హర్షల్ పటేల్ తో పాటు అవేశ్ ఖాన్ లు భారీగా పరుగులిచ్చారు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
దీంతో కటక్ లో జరుగబోయే రెండో టీ20 లో హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ లలో ఎవరో ఒకరికి ఉద్వాసన తప్పదని తెలుస్తున్నది. మాములుగా ప్లేయర్లను మార్చడానికి అంతగా ఆసక్తి చూపని రాహుల్ ద్రావిడ్ కూడా ఈ విషయంలో ఒక మెట్టుదిగాడని జట్టు యాజమన్య వర్గాలు తెలిపాయి.
పటేల్, అవేశ్ లలో ఒకర్ని తప్పిస్తే.. వారి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కు గానీ అర్షదీప్ సింగ్ కు గానీ చోటు దక్కే అవకాశముందని తెలుస్తున్నది. అవేశ్ కంటే హర్షల్ నే తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ లో చేతికి గాయమైన హర్షల్ కు తొలి టీ20 లో కూడా అదే గాయం తిరగబెట్టింది. ఓవర్ ఓవర్ కు అతడు డగౌట్ కు వెళ్లడం.. బ్యాండేజ్ మార్చుకోవడం తెలిసిందే.
ఒకవేళ హర్షల్ ను పక్కనబెడితే ఇదే జరిగితే ఉమ్రాన్, అర్షదీప్ లలో ఎవరో ఒకరికి జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తుంది. ఇక స్పిన్నర్లలో అక్షర్ ను తప్పించి.. రవి బిష్ణోయ్ ను తుది జట్టులోకి తీసుకోవాలని ద్రావిడ్, పంత్ భావిస్తున్నారట.
తొలి టీ20 లో హర్షల్ పటేల్.. 4 ఓవర్లు వేసి 43 పరుగులిచ్చాడు. అతడు వేసిన 16వ ఓవర్లో డసెన్ 22 పరుగులు పిండుకుని మ్యాచ్ ను భారత్ నుంచి దూరం చేశాడు. అవేశ్ ఖాన్ కూడా నాలుగు ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక బ్యాటింగ్ లో టీమిండియా పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చు. తొలి టీ20 లో క్రీజులోకి వచ్చిన ప్రతి ఆటగాడు తమవంతుగా బాది పోయారు. ఇదే బ్యాటింగ్ ఆర్డర్ ను రెండో టీ20 లో కూడా కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.