Harbhajan Singh: ఇష్టంగా కొనుక్కున్న ఇల్లును అమ్ముకున్న హర్భజన్ సింగ్.. లాభమెంతో తెలుసా..?
Harbhajan Singh Apartment: భారత మాజీ ఆటగాడు, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని అమ్మేసుకున్నాడు. నాలుగేళ్లలో భజ్జీ దీనికి మంచి లాభమే పొందాడు.
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లును అమ్మేశాడు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం అంధేరి లో అపార్ట్మెంట్ కొన్న భజ్జీ.. తాజాగా దానిని అమ్మేశాడు.
వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. భారత జట్టు నుంచి నిష్క్రమించిన తర్వాత కొద్దిరోజుల పాటు ఐపీఎల్ లో మెరిశాడు. కొన్ని సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున కూడా ఆడాడు. దీంతో అప్పట్లో అందరికీ అందుబాటులో ఉండేందుకు ముంబైలో అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు.
2017లో రుస్తోమ్జీ నుంచి రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేశాడు. 2018లో దీనిని సంబంధిత పార్టీ నుంచి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ లో భాగంగా ఈ లావాదేవీపై భజ్జీ రూ. 87.90 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించాడు..
కాగా జాప్కీ.కామ్ పత్రాల ప్రకారం.. తాజాగా ఈ అపార్ట్మెంట్ ను భజ్జీ రూ. 17.58 కోట్లకు అమ్మేశాడు. అంటే నాలుగేళ్లలో తాను పెట్టిన పెట్టుబడి కంటే సుమారు మూడు కోట్లకు పైగా హర్భజన్ లాభం పొందాడన్నమాట.
అంధేరిలోని రుస్తోమ్జీ ఎలిమెంట్స్ ప్రాజెక్ట్ తొమ్మిదో అంతస్తులో ఉన్న ఈ అపార్ట్మెంట్ లో అన్ని ఆధునిక సౌకర్యాలున్నాయి. 2,830 స్క్వేర్ ఫీట్లు గల ఈ ఇంటిని అప్పట్లో భజ్జీ ఇష్టపడి కొనుక్కున్నాడు. ప్రముఖ బాలీవుడ్ తారలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారస్తులు, క్రికెటర్లు ఇక్కడే నివసిస్తున్నారు.
ఇక మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో కట్టిన రుస్తోమ్జీ అపార్ట్మెంట్లలో 2, 3, 4, 5 బీహెచ్కే లతో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆవాసాలున్నాయి. ముంబైలో రియల్ ఎస్టేట్ జోరందుకుందని, ఆ ఫలితంగానే పెద్ద పెద్ద అపార్మెంట్లకు మంచి ధర పలుకుతుందని జాప్కీ.కామ్ కో ఫౌండర్ సందీప్ రెడ్డి తెలిపాడు.
ఇదిలాఉండగా.. టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ముంబైలోని లోధా వరల్డ్ క్రెస్ట్ లో ఓ అపార్ట్మెంట్ ను రూ. 11.85 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఐపీఎల్ లో రాణిస్తున్న ఈ ముంబై క్రికెటర్.. భారత్ జట్టుకు వన్డేలు, టీ20లతో పాటు గురువారం నుంచి కాన్పూర్ వేదికగా జరిగే న్యూజిలాండ్ టెస్టులో అరంగ్రేటం చేయబోతున్నాడు.