గిల్ను తీసుకోవడం న్యాయమే కానీ డబుల్ సెంచరీ చేసినోడిని పక్కనబెట్టడం న్యాయమా..? హిట్మ్యాన్ పై ప్రశ్నల వర్షం
INDvsSL: స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ నెగ్గిన తర్వాత భారత జట్టు నేటి నుంచి గువహతి వేదికగా మొదలైన వన్డే సిరీస్ లో తలపడుతున్నది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తుది కూర్పుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీలంకతో వన్డే సిరీస్ లో భాగంగా నేడు గువహతిలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తుది జట్టు కూర్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిని పక్కనబెట్టడం న్యాయమేనా..? అని రోహిత్ శర్మ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ పై ప్రశ్నల వర్షం కురుస్తున్నది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ను తప్పించిన టీమ్ మేనేజ్మెంట్.. రోహిత్ తో ఓపెనింగ్ జోడీగా శుభమన్ గిల్ ను పంపించింది.
నిన్న విలేకరుల సమావేశంలో రోహిత్ కూడా ఇషాన్ ను తుది జట్టులోకి తీసుకోవడం లేదని బల్లగుద్ది చెప్పాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడం గొప్ప విషయమే అయినా అతడు లంకతో సిరీస్ కు బెంచ్ కే పరిమితం కాక తప్పదని అన్నాడు. గత ఏడాది కాలంగా వన్డేలలో నిలకడగా రాణిస్తున్న గిల్ కు ఛాన్సులు ఇవ్వడం న్యాయమని చెప్పాడు.
అయితే ఈ నిర్ణయంపై టీమిండియా ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గిల్ ను తీసుకోవడంపై తమకేమీ అభ్యంతరం లేదని కానీ ఫీయర్లెస్ క్రికెట్ ఆడుతూ బంగ్లాదేశ్ పై వరుసగా రెండు వన్డేలు ఓడినాక ఒత్తిడిలో కూడా డబుల్ సెంచరీ బాదిన ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇదే విషయమై టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘బంగ్లాదేశ్ తో రెండు వరుస మ్యాచ్ లు ఓడి సిరీస్ కోల్పోయాక వాళ్ల గడ్డమీద డబుల్ సెంచరీ చేసిన వ్యక్తికి అవకాశం ఇవ్వకపోవడం న్యాయమేనా..? గిల్ కు ఛాన్స్ లు ఇవ్వడం సమంజసమే కానీ ఇషాన్ ను తప్పించడం మాత్రం కరెక్ట్ కాదు.
మీకు అంతగా కావాల్సి వస్తే గిల్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపి కెఎల్ రాహుల్ బదులు ఇషాన్ ను ఆడిస్తే సరిపోయేది కదా. గత రెండేండ్ల కారణంగా భారత్ పదే పదే చేస్తున్న తప్పులు ఇవే. బాగా ఆడిన క్రికెటర్లను తర్వాత మ్యాచ్ లలో కొనసాగించాల్సింది పోయి వారిని పక్కనపెట్టేస్తున్నారు.
ఇంగ్లాండ్ లో పంత్ సెంచరీ చేశాడు. చివరి మ్యాచ్ లో అతడి సెంచరీతోనే భారత్ మూడో వన్డే గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. కానీ టీ20లలో ఫామ్ కారణంగా అతడిని పక్కనబెట్టారు. కానీ కెఎల్ రాహుల్ రెండు, మూడు మంచి ఇన్నింగ్స్ లు ఆడగానే అతడికి వరుసగా అవకాశాలిస్తున్నారు...’అని పేర్కొన్నాడు.