Virat Kohli: ‘ది కింగ్ ఈజ్ బ్యాక్..’ కోహ్లీ కుదురుకున్నట్టేనా..?
India vs Pakistan: గడిచిన కొద్దికాలంగా విమర్శల జడివానలో మునిగి తేలుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆ ‘గండాన్ని’ దాటినట్టేనా..?

మూడేండ్లుగా సెంచరీ లేదు. పరుగుల వరద పారించిన ఐపీఎల్ లో అయినా ఫామ్ లోకి వస్తాడనుకుంటే అక్కడ సున్నాలు చుట్టాడు. ఇంగ్లాండ్ తో రాణించడం పక్కా అని అంచనాలు కట్టారు. అక్కడే అదే క(వ్య)థ.. సెంచరీ సంగతి పక్కనబెడితే హాప్ సెంచరీ అయినా చాలు అనుకున్నారు కోహ్లీ అభిమానులు.
విరామం తీసుకుంటే కోహ్లీ మెరుగవుతాడని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు దిగ్గజ క్రికెటర్లెందరో అతడికి సూచించారు. ఆరు నెలలుగా అతడు విశ్రాంతి తీసుకోవాలని అందరూ సూచిస్తుండటంతో ఎట్టకేలకు కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. విరామం తర్వాత పాకిస్తాన్ తో ఆడే తొలి మ్యాచ్ లో కోహ్లీ ఎలా ఆడతాడనేది పెద్ద చర్చనీయాంశమైంది.
పాకిస్తాన్ తో మ్యాచ్ లో కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. తాను ఎదుర్కున్న రెండో బంతికే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయిటపడ్డాడు. కానీ తర్వాత అతడు బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే మునపటి కోహ్లీ గుర్తుకురాక మానడు.
గడిచిన ఆరు నెలలుగా కోహ్లీ క్రీజులోకి వచ్చినప్పుడు.. ఆడుతున్నప్పుడు అతడి ముఖంలో ఒకరకమైన నిరాశ భావం కనిపించేది. ఔటై పెవిలియన్ కు వెళ్తున్నప్పుడు అతడి ముఖంలో అది కొట్టొచ్చినట్టు కనిపించేది. కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో మాత్రం అభిమానులంతా పాత కోహ్లీని చూశారు. బ్యాటింగ్ ను ఆస్వాదిస్తూ తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు.
Image credit: PTI
చూడచక్కని బౌండరీలతో పాటు వికెట్ కీపర్ మీదుగా కొట్టిన సిక్సర్ అయితే మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. మరో ఎండ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో నిలదొక్కుకోవడానికే ఇబ్బందులు పడుతుంటే కోహ్లీ మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. పిచ్ లో పేస్ ను ఉపయోగించుకుంటూ కట్టుదిట్టంగా బంతుులు విసురుతున్న పాక్ పేసర్లను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా బ్యాటింగ్ చేసేప్పుడు అతడి నిల్చున్న పొజిషన్, ఆడిన షాట్లు.. తాను ఆడగలనన్న విశ్వాసం అతడి కళ్లల్లో కనిపించాయి.
virat kohli
ఈ మ్యాచ్ లో కోహ్లీ 34 బంతుల్లో 3 పోర్లు, 1 సిక్సర్ తో 35 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ మిస్ అయినా కోహ్లీ.. రోహిత్ తో కలిసి రెండో వికెట్ కు 49 పరుగులు జోడించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహ్మద్ నవాజ్ బౌలింగ్ లో ఓ భారీ షాట్ కు యత్నించి ఔటైనా.. అతడు ఆడిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఔటై పెవిలియన్ చేరాక కూడా కోహ్లీ చలాకీగా కనిపించాడు. సహచరులతో నవ్వుతూ.. జడేజా-పాండ్యాలు ఆడుతున్నప్పుడు ఆసక్తిగా మ్యాచ్ చూస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపాడు.
మరి కోహ్లీ తన గండాన్ని దాటినట్టేనా..? ఫామ్ లోకి వచ్చినట్టేనా..? అంటే ఇప్పుడే చెప్పడం అతిశయోక్తే అవుతుంది. ఆసియా కప్ లో రాబోయే మ్యాచ్ లలో కూడా కోహ్లీ ఇదే సానుకూల దృక్పథంతో ఆడి ఫామ్ ను అందుకుంటే మాత్రం ఇక అతడిని ఆపడం ఎవరితరమూ కాదు. అంతేగాక కీలకమైన టీ20 ప్రపంచకప్ కు ముందు భారత్ కు కొండంత బలం చేకూరినట్టే.. చూద్దాం. మరి కోహ్లీ ఏం చేస్తాడో..!