- Home
- Sports
- Cricket
- జొకోవిచ్కు అలా.. క్రికెటర్లకు ఇలా.. ఇదేం న్యాయం.. కరోనా విషయంలో ఆస్ట్రేలియాపై టెన్నిస్ ఫ్యాన్స్ ఆగ్రహం
జొకోవిచ్కు అలా.. క్రికెటర్లకు ఇలా.. ఇదేం న్యాయం.. కరోనా విషయంలో ఆస్ట్రేలియాపై టెన్నిస్ ఫ్యాన్స్ ఆగ్రహం
T20I World cup 2022: టీ20 ప్రపంచకప్ - 2022లో పాల్గొంటున్న జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ వచ్చినా ఐసోలేషన్ అవసరం లేదని.. మ్యాచ్ ఆడినా పట్టించుకోమని ప్రకటించింది.

ఐసీసీ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచంలో అగ్రగ్రామి క్రీడలుగా ఉన్న రెండు క్రీడల మధ్య వివాదానికి దారి తీసింది. ఆస్ట్రేలియా అనుమతి తెలిపిన ఈ మార్గదర్శకాలపై క్రికెట్-టెన్నిస్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ కు దారి తీసింది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను ఎత్తేయడంతో కరోనా టెస్టులు, క్వారంటైన్ లు, ఐసోలేషన్ లు ఏమీ ఉండవు. అంతేగాక ఎవరైనా ఆటగాడు కరోనా బారిన పడ్డా జట్టు, డాక్టర్ అనుమతి తీసుకుని సదరు క్రికెటర్ మ్యాచ్ కూడా ఆడొచ్చని, ఇందులో తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని ఐసీసీ పేర్కొంది.
అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై టీ20 ప్రపంచకప్ ఆడుతున్న సభ్యదేశాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి. దీనివల్ల ప్రధాన ఆటగాడు కరోనా బారిన పడి స్వల్ప లక్షణాలున్నా మ్యాచ్ ను ఆడించొచ్చని సంబురాలు చేసుకుంటున్నాయి. కానీ ఇదే సమయంలో టెన్నిస్ ఫ్యాన్స్, మరీ ముఖ్యంగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫ్యాన్స్ మాత్రం ఆస్ట్రేలియాపై గుర్రుగా ఉన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ - 2022లో నొవాక్ జొకోవిచ్ ను ఆడించేందుకు ససేమిరా ఒప్పుకోమని అక్కడి ప్రభుత్వం కరాకండీగా చెప్పింది. జొకోవిచ్ కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే టెన్నిస్ కోర్టులోకి అనుమతిస్తామని అతడిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.
మరోవైపు తాను వ్యాక్సిన్ వేసుకోనని మంకు పట్టిన జొకోవిచ్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం పై అక్కడ అత్యున్నత కోర్టులో కేసు వేసి మరీ కొట్లాడాడు. ఈ సందర్భంగా టెన్నిస్ ప్రపంచం మొత్తం అతడికి అండగా నిలిచింది.
Image Credit: Getty Images
కానీ అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాత్రం తమ ప్రభుత్వం కరోనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని.. ఎంతటి ప్రముఖులైనా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
చివరికి జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఆడకుండానే తిరిగి ఇంటికి చేరాడు. ఈ ఘటన టెన్నిస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇదే కారణంతో జొకోవిచ్ యూఎస్ ఓపెన్ కూడా ఆడలేదు. ఇదిలాఉండగా తాజాగా ఐసీసీ మాత్రం క్రికెటర్లకు కరోనా వచ్చినా ప్రపంచకప్ వంటి మెగాటోర్నీ కూడా ఆడొచ్చని చెప్పడంతో టెన్నిస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జొకోవిచ్ వ్యాక్సిన్ వేసుకోకుంటేనే నానా యాగి చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు కోవిడ్ వచ్చినా ఒక ఆటగాడు ఆడటానికి ఎలా అనుమతినిస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి లేకుండానే ఇదంతా జరుగుతున్నదా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.