మహిళలు మ్యాజిక్ చేస్తున్నారు... బీసీసీఐ డబ్బులు రెఢీ చేసుకోవాల్సిందే... ప్రధాని కూడా ఫిదా...
భారత క్రికెట్లో మహిళా క్రికెటర్లపై చిన్నచూపు... కొన్నాళ్ల కిందటి దాకా దీనిపై తీవ్రస్థాయిలో చర్చజరిగింది. మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్ ప్రకటించిన తర్వాత పురుషుల క్రికెటర్లతో పోలిస్తే, మహిళా క్రికెటర్లకు చెల్లించే మొత్తం 10 శాతం కూడా లేదని చర్చ జరిగింది...
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు ఏటా రూ. 7 కోట్లు కాంట్రాక్ట్ కింద చెల్లిస్తున్న బీసీసీఐ, మహిళా క్రికెట్లో స్టార్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందాన, పూనమ్ రౌత్లకు ఏటా రూ.50 లక్షలు మాత్రమే చెల్లిస్తోంది...
కోహ్లీతో పోలిస్తే, స్మృతి మందానకి చెల్లించే మొత్తం 10 శాతం కంటే తక్కువే. దీని గురించే తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అయితే ఆ సమయంలో స్మృతి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది...
‘మహిళా క్రికెటర్లకు చెల్లించే పారితోషికం తక్కువే. అయితే మాకు చెల్లించే డబ్బులు కూడా మెన్స్ క్రికెట్ నుంచే వస్తున్నాయి. మహిళా క్రికెట్ నుంచి డబ్బులు రావడం మొదలెట్టినప్పుడు మాకు కూడా సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం...’ అంటూ కామెంట్ చేసింది స్మృతి మందాన...
ఇప్పుడు భారత మహిళా జట్టు ఆటతీరు యావత్ భారతాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వన్డే సిరీస్లో మిథాలీరాజ్ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది అందరి దృష్టినీ ఆకర్షించింది...
ఆఖరి వన్డేలో స్మృతి మందాన కళ్లు చెదిరే క్యాచ్ అందుకుంటే, మొదటి టీ20 మ్యాచ్లో బౌండరీ లైన్ దగ్గర హర్లీన్ డియోల్ అందుకున్న క్యాచ్పై మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు.
మాజీ క్రికెటర్లతో పాటు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హర్లీన్ డియోల్ క్యాచ్పై స్పందించడం విశేషం. ‘హర్లీన్... అద్భుతం చేశావంటూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు నరేంద్ర మోదీ...
పురుషుల క్రికెట్తో పోలిస్తే మహిళా క్రికెట్ మ్యాచ్లు చూడడం కాస్త బోరింగ్గా ఉంటుందనే విమర్శ ఉండేది. అయితే షెఫాలీ వర్మ ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది...
రెండో టీ20 మ్యాచ్లో ఒకే ఓవర్లో వరుసగా ఐదు ఫోర్లు బాదిన షెఫాలీ వర్మ, వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో దూకుడుగా ఆడుతూ క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది...
ఇంతకుముందు కూడా హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందాన దూకుడుగా ఆడేవాళ్లు. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వేదా కృష్ణమూర్తి, కళ్లు చెదిరే క్యాచులు, మెరుపు రనౌట్లు చేసేది...
అయితే అప్పుడు భారత మహిళా జట్టు ఆడే మ్యాచుల గురించి చాలామందికి తెలిసేది కాదు. ఇప్పుడు షెఫాలీ వర్మ ఎంట్రీ తర్వాత మహిళా క్రికెట్కి ఆదరణ పెరుగుతోంది...
ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు పోరాటం అద్భుతం. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా, మహిళా జట్టు రేంజ్లో ఆడి ఉంటే సీన్ వేరేగా ఉండేది...
మహిళల పర్ఫామెన్స్ ఇదే రేంజ్లో కొనసాగితే, అతి త్వరలోనే వారి మ్యాచ్లకూ రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ రావడం ఖాయం. అదే జరిగితే మహిళా క్రికెటర్లకు కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి బీసీసీఐ...