వైజాగ్ టెస్ట్: రోహిత్ శతకం, మయాంక్ ద్విశతకం...ఓపెనింగ్ జోడి రికార్డులివే
విశాఖ టెస్ట్ లో టీమిండియా ఓపెనింగ్ జోడి రికార్డుల మోత మోగించింది. రోహిత్-మయాంక్ ల జోడీ ఏకంగా 317 పరుగుల భాగస్వామ్యంతో టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ జోడీగా నిలిచింది.
స్వదేశంలో జరుగుతున్న మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీలో టీమిండియాకు మంచి శుభారభం లభించింది. సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికన జరుగుతున్న మొదటి టెస్ట్ లో కోహ్లీసేన పయనం భారీ స్కోరు దిశగా సాగుతోంది. విశాఖ టెస్ట్ ద్వారా ఓపెనర్ గా ఆరంగేట్రం చేసిన రోహిత్...కేవలం ఐదు టెస్టులాడిన అనుభవమున్న మయాంక్ అగర్వాల్ లు అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి విజృంభణతో మొదటిరోజును వికెట్లేమీ కోల్పోకుండానే ముగించిన టీమిండియా రెండోరోజు కూడా అదే ఊపు కొనసాగించింది.
రోహిత్ సెంచరీ, మయాంక్ డబుల్ సెంచరీతో సత్తాచాటారు. సెంచరీకి చేరువలో రోహిత్ శర్మ(176 పరుగులు) స్టంపౌట్ రూపంలో వెనుదిరగడంతో మొదటి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇలా వీరిద్దరు కలిసి 317 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించారు. దీంతో టెస్ట్ క్రికెట్లో కొన్ని అరుదైన రికార్డులు ఈ జోడీ పేరిట నమోదయ్యాయి.
దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగుల ఓపెనింగ్ బాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడిగా రోహిత్-మయాంక్ లు నిలిచారు.
కేవలం ఓపెనింగ్ లోనే కాదు ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. దీంతో ఓవరాల్ గా చూసినా సౌతాఫ్రికాపై అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రికార్డు కూడా ఈ జోడీ పేరిటే నమోదయ్యింది.
టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన 23వ భారత ఆటగాడిగా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. ఓవరాల్ గా టెస్టు క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన 86వ క్రికెటర్గా అగర్వాల్ రికార్డుల్లోకెక్కాడు.
ఒకే మ్యాచ్ లో ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు బాదడం చాలా అరుదు. కానీ వైజాగ్ టెస్ట్ లో రోహిత్ సెంచరీ(176), మయాంక్ అగర్వాల్ సెంచరీ బాదడం ద్వారా(215 పరుగులు) రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు భారత ఓపెనర్లిద్దరు ఒకే ఇన్నింగ్స్ లో సెంచరీలు బాదగా తాజాగా రోహిత్-మయాంక్ లు పదో జోడీగా నిలిచారు.
ఈ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ ఖాతాలోకి మరో అరుదైన ఘనత చేరింది. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని పార్మాట్లలో(వన్డే, టీ20 ఇప్పుడు టెస్ట్) ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీ చేసిన ఆటగాళ్లు కేవలం ఆరుగురు మాత్రమే. క్రిస్ గేల్, బ్రెండన్ మెక్కల్లమ్, మార్టిన్ గప్తిల్, తిలకరత్నే దిల్షాన్, అహ్మద్ షహజాద్, షేన్ వాట్సన్, తమీమ్ ఇక్బాల్ ఇప్పటివరకు ఆ జాబితాలో వుండగా తాజా రోహిత్ ఏడో ఆటగాడిగా ఇందులో చేరాడు.
అయితే అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన ఏకైక భారత ఓపెనర్ గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. సెహ్వాగ్, సచిన్, గంగూలీ వంటి దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ఘనతను రోహిత్ సాధించాడు.