టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి టీమిండియా... అయితే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ గెలిస్తేనే...
వన్డే, టీ20 ఫార్మాట్లలో కాకుండా టెస్టు క్రికెట్లో మొట్టమొదటిసారి ఐసీసీ నిర్వహిస్తోన్న టోర్నీ టెస్టు ఛాంపియన్షిప్ తుది దశకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 14 నుంచి ఇంగ్లాండ్లోని ప్రఖ్యాత లార్డ్ క్రికెట్ మైదానంలో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇంకా ఫైనల్ రేసులో నాలుగు జట్లు మిగలగా... మూడు జట్లు ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి.
న్యూజిలాండ్తో న్యూజిలాండ్లో గత ఏడాది ఆరంభంలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టెస్టు ఛాంపియన్షిప్ రేసులో వెనకబడింది భారత జట్టు...
లాక్డౌన్ కారణంగా పాయింట్ల పద్ధతిన కాకుండా విజయాల శాతం పరిగణనలోకి తీసుకోవడంతో భారత జట్టు ప్లేస్ డౌటే అనిపించింది.
అయితే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా... 2-1 తేడాతో టెస్టు సిరీస్ సొంతం చేసుకుని టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్ ప్లేస్లోకి ఎగబాకింది.
వెస్టిండీస్, పాకిస్థాన్లను చిత్తు చేసిన న్యూజిలాండ్... టెస్టు ఛాంపియన్షిప్లో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది.
ప్రస్తుతం శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్, టెస్టు ఛాంపియన్షిప్లో నాలుగో స్థానంలో ఉంది...
ప్రస్తుతం 71.67 విజయాల శాతంతో 430 పాయింట్ల ఖాతాలో వేసుకున్న టీమిండియా... ఫైనల్ చేరుకోవాలంటే స్వదేశంలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్ గెలిస్తే సరిపోతుంది...
అయితే కనీసం ఇంగ్లాండ్ కంటే రెండు మ్యాచులు ఎక్కువగా గెలవాల్సి ఉంటుంది. అంటే 2-0, 3-1, 3-0, లేదా 4-0 తేడాతో ఇంగ్లాండ్ను క్లీన్ స్వీప్ చేస్తే భారత జట్టు నేరుగా టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరుకుంటుంది.
రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్... స్వదేశంలో వరుసగా 6 టెస్టు విజయాలు సాధిస్తూ దుమ్మురేపింది. అయితే ఇప్పటికే ఐదు టెస్టు సిరీస్లు ఆడిన కివీస్, టెస్టు ఛాంపియన్షిప్కి ముందు మరో టెస్టు సిరీస్ ఆడబోవడం లేదు...
ప్రస్తుతం 70 శాతం విజయాలతో 420 సంపాదించిన న్యూజిలాండ్ను వెనక్కినెట్టేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లకు అవకాశం ఉంది...
టీమిండియా చేతిలో టెస్టు సిరీస్ ఓడిన ఆస్ట్రేలియా, త్వరలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడబోతోంది... ప్రస్తుతం ఉన్న ఫామ్ని దృష్టిలో పెట్టుకుని సౌతాఫ్రికాని ఓడించడం వారికి చాలా తేలిక...
అయితే సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ లేదా 2-0 తేడాతో ఓడిస్తేనే ఆస్ట్రేలియా జట్టుకి రెండో స్థానానికి చేరుకునే అవకాశం దొరుకుతుంది. లేదంటే భారత జట్టు ఓడిపోవాలని కోరుకోవాల్సిందే.
ఒకవేళ ఏ కారణం వల్లైనా సౌతాఫ్రికా సిరీస్ రద్దు అయినా, సఫారీలు, కంగారులకు షాక్ ఇచ్చినా... ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నుంచి తప్పుకోక తప్పదు.
నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవాలంటే భారత జట్టును క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే శ్రీలంకను మొదటి టెస్టులో ఓడించిన ఇంగ్లాండ్, రెండో టెస్టు కూడా గెలవాల్సి ఉంటుంది...
ఒకవేళ ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఓడిపోతే మాత్రం భారత జట్టు, ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ఫలితం మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఆసీస్, సఫారీలను చిత్తు చేస్తే, భారత జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక... ప్రస్తుతం టెస్టు ఛాంపియన్షిప్లో ఐదు, ఆరు, ఏడు స్థానంలో ఉన్నాయి. ఇకపై జరిగే మ్యాచుల్లో గెలిచినా, సిరీస్లు సొంతం చేసుకున్నా ఈ మూడు జట్లకి ఫైనల్ చేరే అవకాశం లేదు.