IPL2022: సిరాజ్ రికార్డును సమం చేసిన హర్షల్ పటేల్.. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరే..
TATA IPL2022: బుధవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి ఓవర్లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో బౌలింగ్ లో ఇరగదీసిన హర్షల్ పటేల్ తన సహచర ఆటగాడు మహ్మద్ సిరాజ్ రికార్డును సమం చేశాడు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో పది కోట్ల రూపాయలకు పైగా ధర పలికి బెంగళూరు దక్కించుకున్న కీలక ఆటగాడు హర్షల్ పటేల్. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని అతడెప్పుడూ వమ్ము చేయలేదు.
స్లో డెలివరీలతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో హర్షల్ దిట్ట. నిన్నటి మ్యాచులో అతడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు తొలి రెండు ఓవర్లను మెయిడిన్లు గానే వేయడం విశేషం.
అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ జట్టును రక్షించే బాధ్యత తీసుకున్న ఆండ్రీ రసెల్.. అంతకుముందే బౌలింగ్ చేసిన షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు బాది జోరు మీద కనిపించాడు.
అయితే అదే సమయంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. హర్షల్ కు బౌల్ అందించాడు. ఆ ఓవర్లో హర్షల్.. పరుగులేమీ ఇవ్వలేదు. ఇక తర్వాత ఓవర్లో కూడా ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రసెల్ వికెట్ కూడా తీశాడు.
ఇలా వరుసగా రెండు ఓవర్లు వేసిన రికార్డు గతంలో మహ్మద్ సిరాజ్ పేరిట ఉండేది. ఆశ్చర్యకరంగా సిరాజ్ కూడా ఈ రికార్డు కేకేఆర్ మీదే నెలకొల్పడం విశేషం.
2020 సీజన్ లో సిరాజ్.. కేకేఆర్ తో మ్యాచ్ సందర్భంగా తొలి రెండు ఓవర్లు మెయిడిన్లు విసిరాడు. మొత్తంగా ఆ మ్యాచులో సిరాజ్.. నాలుగు ఓవర్లు విసిరి 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.
ఇక తాజాగా హర్షల్ కూడా అదే కేకేఆర్ మీద నాలుగు ఓవర్లు వేసి తొలి రెండు మెయిడిన్లు గా విసరడమే గాక 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి రెండు ఓవర్లు వేసిన ఘనత సిరాజ్, హర్షల్ పేరుమీదటే ఉంది. ఈ ఇద్దరూ ఆర్సీబీ బౌలర్లే కావడం విశేషం.
ఇక బుధవారం నాటి మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా కు కేకేఆర్ బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి మ్యాచులో భారీ స్కోరు చేసినా పంజాబ్ చేతిలో ఓడామన్న కసి బౌలర్లలో కనిపించింది. దీంతో ఆ జట్టు ప్రధాన బౌలర్లైన సిరాజ్ (1), ఆకాశ్ దీప్ (3), వనిందు హసరంగ (4), హర్షల్ పటేల్ (2) లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో కేకేఆర్ 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 19.2 ఓవర్లలో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది.