IPL 2022: ప్లేఆఫ్స్ కు లక్నో, గుజరాత్..? బీసీసీఐ కీలక నిర్ణయం
TATA IPL2022: ఐపీఎల్ ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. ఇప్పటికే లీగ్ కు సంబంధించి మహారాష్ట్రలోని ముంబై, పూణెలలో మ్యాచులు జరుగుతున్నాయి. అయితే ప్లేఆఫ్స్ కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్-2022 సీజన్ క్రికెట్ ప్రేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నది. వారం రోజులు గడిచిన లీగ్ లో మహారాష్ట్రలోని ముంబై, పూణె వేదికగా మ్యాచులు జరుగుతున్నాయి. లీగ్ లు జరుగుతున్నా ప్లేఆఫ్స్ పై మాత్రం గతంలో స్పందించని బీసీసీఐ కీలక అడుగేసింది.
లీగ్ దశ ముగియకముందే ప్లేఆఫ్స్ కు లక్నో, గుజరాత్ ను ఎంపిక చేశాయి. అదేంటి.. ఆ జట్లు ఇంకా సగం మ్యాచులు కూడా పూర్తి చేయకముందే ప్లేఆఫ్స్ ను ఎంపిక చేయడమేంటి..? అనుకుంటున్నారా..?
ఆగండాగండి.. లక్నో, గుజరాత్ లంటే ఐపీఎల్ లో చేరిన కొత్త జట్లు కాదు. ప్లేఆఫ్స్ జరిగే వేదికలు. మహారాష్ట్రలో లీగ్ దశ మ్యాచులను నిర్వహిస్తున్న బీసీసీఐ.. ప్లే ఆఫ్స్ ను లక్నోతో పాటు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహించాలని అనుకుంటున్నది.
ఈ మేరకు బీసీసీఐ సభ్యులు పలు దఫాలు చర్చలు కూడా చేసినట్టు సమాచారం. మే 22తో ఐపీఎల్ లీగ్ దశ ముగుస్తుంది. ఇక ప్లే ఆఫ్స్, ఫైనల్స్ లు మరో వారం రోజుల్లో ముగుస్తాయి. మే 29న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది.
అయితే లీగ్ దశ ముగిసాక మహారాష్ట్రలోనే ప్లే ఆఫ్స్ ను నిర్వహిస్తారని గతంలో భావించినా.. కరోనా అదుపులోకి రావడం, స్టేడియంలో కూడా ప్రేక్షకుల సంఖ్యను పెంచడం తో దీనిని మిగతా నగరాలకు విస్తరించాలని బీసీసీఐ భావిస్తున్నది.
అదీగాక అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) ఫ్రాంచైజీలు ఈసారి ఐపీఎల్ లో కొత్తగా చేరాయి. ఈ నేపథ్యంలో అక్కడి అభిమానులకు కూడా తమ సొంత గ్రౌండ్ లో మ్యాచులను వీక్షించే అవకాశమిచ్చినట్టు ఉంటుందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
కాగా.. ప్రస్తుతం ముంబైలోని వాంఖెడే, డీవై పాటిల్ స్టేడియం, బ్రబోర్న్ తో పాటు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) లో లీగ్ మ్యాచులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.