టీ20 వరల్డ్కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక సంఘటనల ప్రభావం ఆదివారం జరిగే భారత్, పాక్ మ్యాచ్పై పడే అవకాశం కనిపిస్తోంది...
2019 వన్డే వరల్డ్కప్ టోర్నీ తర్వాత మళ్లీ రెండేళ్లకు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మ్యాచ్కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది...
ఐసీసీ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి కూడా. ఈ మ్యాచ్కి మరింత క్రేజ్ పెంచేందుకు ‘మోకా... మోకా’ అంటూ యాడ్స్, క్రికెటర్ల ఇంటర్వ్యూలతో సందడి కూడా మొదలైంది...
అయితే శ్రీనగర్ ఏరియాలో దసరా తర్వాత తీవ్రవాదులు మరోసారి ఎగబడ్డారు. 24 గంటల వ్యవధిలో దాదాపు 9 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ కాల్పుల్లో 13 మంది తీవ్రవాదులతో పాటు కొందరు స్థానికులు కూడా చనిపోయారు..
ఈ సంఘటనల తర్వాత టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్తో మ్యాచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, సోషల్ మీడియాలో 'ban pak cricket' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు నెటిజన్లు...
తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ డిమాండ్కి సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేయడంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సజావుగా సాగుతుందా? అనేది అనుమానంగా మారింది...
‘పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాలా? వద్దా? అనే విషయం గురించి భారత జట్టు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేవు... ’అంటూ కామెంట్ చేశారు గిరిరాజ్ సింగ్..
అలాగే పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ కూడా ఈ మ్యాచ్ను రద్దు చేయడమే కరెక్ట్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు... ‘టీ20 వరల్డ్ కప్లో భారత్, పాక్ మ్యాచ్ను రద్దు చేస్తేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు దేశసరిహద్దులో పరిస్థితులు సరిగా లేవు... ఇరుదేశాల మధ్య వాతావరణం కూడా సరిగా లేదు..
ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహిస్తే, హింసాత్మక సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇరుదేశాల మధ్య వైరం మరింతగా పెరిగిపోతుంది...’ అంటూ తెలిపాడు పర్గత్ సింగ్...
కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి, భారత్,పాకిస్తాన్ మధ్య జరుగుతుందా? లేదా? అనేది తేలనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ను ఆడకూడదని భారత జట్టు నిర్ణయించుకుంటే, రెండు పాయింట్లు కోల్పోతుంది...