- Home
- Sports
- Cricket
- అప్పుడు టీమిండియా 36కే ఆలౌటైంది.. కానీ అద్భుతంగా పుంజుకుంది.. అటువంటి స్ఫూర్తి పాక్కు కావాలి : గవాస్కర్
అప్పుడు టీమిండియా 36కే ఆలౌటైంది.. కానీ అద్భుతంగా పుంజుకుంది.. అటువంటి స్ఫూర్తి పాక్కు కావాలి : గవాస్కర్
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ వేటలో పాకిస్తాన్ కు ఆదిలోనే డబుల్ షాకులు తగిలాయి. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ తో పాటు రెండో మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో కూడా చిత్తైంది.

వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి టీ20 ప్రపంచకప్ లో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆడుతున్న నెదర్లాండ్స్ తో పాటు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మీద కూడా భారీ విజయాలు సాధించాల్సి ఉంది. అయితే భారత్ తో ఓడిన తర్వాత కంటే జింబాబ్వేపై ఓడినందుకు పాకిస్తాన్ జట్టుకు మద్దతు కరువైంది.
ఆ జట్టు సీనియర్లతో పాటు మేనేజ్మెంట్ కూడా బాబర్ ఆజమ్ అండ్ కో. పై గుర్రుగా ఉంది. జట్టు ఆటతీరు, సెలక్షన్ పై సీనియర్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తాజాగా స్పందించాడు. భారత జట్టు రెండేండ్ల క్రితం అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటై టెస్టు ఓడిన తర్వాత మేనేజ్మెంట్ వారికి సపోర్ట్ గా నిలిచిందని చెప్పాడు.
పాకిస్తాన్ జట్టుకు ఇప్పుడు మద్దతు కరువైందని.. ఆ జట్టుకు నైతిక మద్దతు అవసరముందని సూచించాడు. పాకిస్తాన్ వరుసగా రెండు ఓటముల తర్వాత ఆ జట్టుపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ సన్నీ ఆసకక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సన్నీ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు ఇటువంటి ఫలితాలు జట్టును తీవ్ర నిరాశపరుస్తాయి. కానీ దీని నుంచి బయటపడటానికి మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్, సీనియర్ల మద్దతు కావాలి. వాళ్లు జట్టులో స్ఫూర్తిని నింపాలి. గతాన్ని మరిచిపోయి తర్వాత మ్యాచ్ ల గురించి ఆలోచించాలి.
రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియాలో భారత జట్టు ఇందుకు మంచి ఉదాహరణ. అడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. ఆ టెస్టులో దారుణంగా ఓడింది. ఆ తర్వాత టెస్టులకు కోహ్లీ కూడా అందుబాటులో లేడు. పితృత్వ సెలవుల సందర్భంగా అతడు స్వదేశానికి వచ్చాడు.
కానీ అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి.. అతడి సిబ్బంది భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్, ఆర్. శ్రీధర్ లతో పాటు సారథిగా వ్యవహరించిన అజింక్యా రహానే, మేనేజ్మెంట్ అందరూ జట్టుకు అండగా నిలిచారు. జట్టులో స్ఫూర్తిని నింపారు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. అటువంటి స్ఫూర్తి ఇప్పుడు పాకిస్తాన్ కు కావాల్సి ఉంది..’ అని తెలిపాడు.
అడిలైడ్ లో ఓటమి తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. 2020-2021 లో ఆసీస్ లో పర్యటించిన భారత్.. తొలి టెస్టులో ఓడినా.. ఆ తర్వాత కోహ్లీ ఇంటికి తిరిగొచ్చినా యంగ్ ఇండియా.. ఆస్ట్రేలియాను 2-1తో ఓడించి సిరీస్ సొంతం చేసుకుంది. రెండో టెస్టులో గెలిచింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. బ్రిస్బేన్ లో ముగిసిన నాలుగో టెస్టులో భారత్ అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించింది.