లంకలో ఆసియా కప్..? నెలాఖరున కీలక నిర్ణయం.. టోర్నీని బహిష్కరించే యోచనలో పాక్!
Asia Cup Row: ఆసియా కప్ -2023 నిర్వహణ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ అంశంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

ఆసియా కప్ - 2023 నిర్వహణాంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీని షెడ్యూల్ ప్రకారమైతే పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉండగా తాజా రిపోర్టుల ప్రకారం అది మారినట్టు తెలుస్తున్నది. ఆసియా కప్ ను పాకిస్తాన్ లో కాకుండా శ్రీలంకలో నిర్వహించనున్నట్టు సమాచారం.
ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన కథనం మేరకు.. ఏసీసీ దీనిపై ఈ నెలాఖరున తుది నిర్ణయం వెల్లడించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. భారత్ మాదిరిగానే పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తే తాము వెళ్లబోమని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు బీసీసీఐకి మద్దతు తెలపడంతో ఈ టోర్నీ నిర్వహణ వివాదం మరో టర్న్ తీసుకుంది.
వాస్తవానికి సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్తాన్ కు రాబోమని.. తమ మ్యాచ్ లను అక్కడ్నుంచి తటస్థ వేదికలకు మళ్లిస్తేనే ఆడతామని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ కూడా అంగీకారం తెలిపినట్టు వార్తలు వచ్చాయి.
అయితే కొద్దిరోజుల క్రితమే పీసీబీ చీఫ్ నజమ్ సేథీ మాట్లాడుతూ.. తాము వన్డే వరల్డ్ కప్ లో భారత్ కు వచ్చి ఆడాలంటే టీమిండియా 2025లో పాకిస్తాన్ లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతామని రాతపూర్వకంగా రాసిస్తేనే ప్రపంచకప్ ఆడతామని చెప్పాడు. ఇది బీసీసీఐకి మరింత ఆగ్రహం తెప్పించింది.
దీంతో ఇన్నాళ్లు ఆసియా కప్ -2023 ని తటస్థ వేదిక ఆడతామన్న బీసీసీఐ.. పీసీబీ తాజా అల్టిమేటానికి ఊహించని కౌంటరే ఇచ్చింది. అందుకే బీసీబీ, శ్రీలంక, అఫ్గాన్ లు కూడా మద్దతు కూడగట్టినట్టు క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది. మొత్తంగా పాకిస్తాన్ నుంచే టోర్నీని తరలించడంలో బీసీసీఐ వెనుకనుంచి పావులు కదిపిందని తెలుస్తున్నది.
కాగా లంకలో ఆసియా కప్ నిర్వహిస్తే ఈ టోర్నీని పాకిస్తాన్ బహిష్కరించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. లంక కాకుండా యూఏఈలో ఆసియా కప్ నిర్వహించాలని చూసినా సెప్టెంబర్ లో అక్కడ విపరీతమైన ఎండలు ఉంటాయి. 2018లో సెప్టెంబర్ లోనే ఆసియా కప్ జరుగగా హార్ధిక్ పాండ్యా గాయపడ్డాడు.
ఎండలను తట్టుకోవడం ప్లేయర్లకు సవాల్ తో కూడుకున్నది. లంకలో అయితే కొంచెం వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయని.. దాదాపు ఇదే వేదికను కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ఇదే మంకుపట్టుతో ఉంటే మాత్రం ఆ జట్టు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.