గంగూలీ కూడా చెప్పేశారు, శ్రీలంక టూర్కి కోచ్ ఆయనే... రవిశాస్త్రికి చెక్ పడనుందా...
జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకి కోచ్గా రాహుల్ ద్రావిడ్ వ్యవహారించబోతున్నట్టు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్వయంగా ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లుగా వస్తున్న వార్తలు నిజమేనంటూ తేలిపోయింది. మాజీ క్రికెటర్, అండర్ 19 కోచ్ నేతృత్వంలో, శిఖర్ ధావన్ కెప్టెన్సీలో లంక టూర్కి బయలుదేరనుంది భారత జట్టు.
వన్డేలు, టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న అతికొద్ది మంది క్రికెటర్లలో ఒకడైన రాహుల్ ద్రావిడ్, 2018లో అండర్19 వరల్డ్కప్ గెలిచిన యంగ్ జట్టుకి కోచ్గా ఉన్నాడు.
2016లో రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో భారత అండర్19 జట్టు ఫైనల్ చేరి, రన్నరప్గా నిలిచింది. ఇండియా ఏ టీమ్కి కోచ్గా నాలుగేళ్లు వ్యవహరించిన ద్రావిడ్, మెరికల్లాంటి ప్లేయర్లను భారత జట్టుకి అందించారు.
ఇప్పుడు భారత జట్టు రిజర్వు బెంచ్ ఇంత పటిష్టంగా తయారుకావడానికి అండర్19 దశలో రాహుల్ ద్రావిడ్ చేసిన కృషే కారణం. శ్రీలంక టూర్కి రాహుల్ ద్రావిడ్ని హెడ్ కోచ్గా ప్రకటించడంతో భారత జట్టు కోచ్గా ఆయన్ని నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చర్చ జరుగుతోంది.
2012లో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2014లో ఇంగ్లాండ్లో పర్యటించిన భారత జట్టుకి బ్యాటింగ్ కన్సల్టెంట్గా వ్యవహారించాడు ద్రావిడ్. అయితే ఇంగ్లాండ్ టూర్ పిచ్ల మీద మనవాళ్లు ఎప్పటిలాగే ఫెయిల్ అయ్యారు.
అయితే ప్రస్తుతం భారత టెస్టు టీమ్కి వెన్నెముకగా మారిన ఛతేశ్వర్ పూజారాలోని అసలైన టాలెంట్ బయటికి వచ్చింది ఈ టూర్లోనే. అలా భువనేశ్వర్ కుమార్, మురళీ విజయ్ ఈ టూర్లో చక్కగా రాణించారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కెరీర్లో అత్యంత క్లిష్టమైన సిరీస్ ఇదే...
ప్రస్తుతం భారత హెడ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్తో ముగియనుంది. దీంతో అతని తర్వాత భారత జట్టు కోచ్గా రాహుల్ ద్రావిడ్ నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. తన సహచరుడు అనిల్ కుంబ్లేకి కోచ్గా జరిగిన పరాభవాన్ని చూసిన ద్రావిడ్, హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకునేందుకు సుముఖంగా లేడని సమాచారం.
అయితే రవిశాస్త్రి తర్వాత యువకులతో నిండనున్న భారత జట్టుకి రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ అయితేనే కరెక్టుగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. అదీకాకుండా అనిల్ కుంబ్లేకి అవమానం జరిగిన సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ లేడు. గంగూలీ ఉండి ఉంటే, సీన్ వేరేగా ఉండేది.
ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ద్రావిడ్, లంక టూర్లో యువకులకు మార్గనిర్దేశం చేయనున్నాడు. ఈ టూర్లో జట్టు పర్ఫామెన్స్ని బట్టి ద్రావిడ్, ఫ్యూచర్ టీమిండియా కోచ్గా బాధ్యతలు అప్పగించేందుకు పావులు కదపనుంది భారత క్రికెట్ బోర్డు.
శిఖర్ ధావన్ కెప్టెన్సీలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టు బృందం ఇప్పటికే ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్లోకి చేరుకుని, క్వారంటైన్లో గడుపుతున్నారు.
లంకలో పర్యటించే భారత పూర్తి జట్టు ఇదే: శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీషా, దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్ధిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, యజ్వేంద్ర చాహాల్, రాహుల్ చాహార్, కె గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహార్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా.