ఆరు టోర్నీలు, ఆరు భిన్నమైన విజేతలు... ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ...
ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్కి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి టెస్టు ఫార్మాట్ మెగా టోర్నీ ఫైనల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్కి ముందు ఓ సెంటిమెంట్, టీమిండియా ఫ్యాన్స్ను కలవరపెడుతుంది..
అదేంటంటే... ఐసీసీ నిర్వహించిన గత ఆరు టోర్నీలు, ఆరు భిన్నమైన దేశాలు విజేతగా నిలిచాయి. గత 8 ఏళ్లల్లో ఏ జట్టూ కూడా ఐసీసీ టోర్నమెంట్లలో రెండు సార్లు విజయం అందుకోలేకపోయింది.
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్ను 5 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు, ధోనీ కెప్టెన్సీలో టైటిల్ కైవసం చేసుకుంది.
2014 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టును ఓడించి, శ్రీలంక విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ 77 పరుగులతో రాణించినా మిగిలిన ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఫైనల్లో టీమిండియా చిత్తుగా ఓడింది...
2015 వన్డే వరల్డ్కప్లో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. న్యూజిలాండ్ ఫైనల్లో 45 ఓవర్లలో 183 పరుగులకి ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సులువుగా చేధించింది.
2016 టీ20 వరల్డ్కప్లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్ విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి సులువుగా చేధించింది విండీస్ టీమ్...
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో భారీ స్కోరు చేసిన పాక్, టీమిండియా బ్యాట్స్మెన్ను స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చి భారీ విజయాన్ని అందుకుంది. భారత క్రికెట్ ఫ్యాన్స్కి ఈ ఫైనల్ ఓ పీడకలగా మిగిలిపోయింది.
2019 వన్డే వరల్డ్కప్లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ టైగా ముగియడం, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంగ్లాండ్కి వరల్డ్కప్ దక్కింది..
2013 నుంచి వరుసగా టీమిండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఐసీసీ టోర్నీల్లో విజేతలుగా నిలిచాయి. భారత జట్టు 2013 తర్వాత రెండు సార్లు ఫైనల్ చేరి ఓడగా, న్యూజిలాండ్ కూడా 2015 వన్డే వరల్డ్కప్, 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్స్లో ఓటమి పాలైంది.
ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఈ సారి ఐసీసీ ఫైనల్లో కొత్త జట్టు విజేతగా నిలుస్తుందని... అలా చూసుకుంటే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవడం ఖాయమంటున్నారు క్రికెట్ పండితులు...
అయితే 2013 తర్వాత మళ్లీ ఈ ఏడాది నుంచి సీన్ రిపీట్ కావచ్చని... అలా చూసుకుంటే భారత జట్టు కూడా ఫైనల్ మ్యాచ్ గెలిచి, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు మరికొందరు క్రికెట్ ఫ్యాన్స్...