ఆమె నా చెల్లి.. తనవైపు చూశావంటే చంపేస్తా.. హిట్ మ్యాన్ కు వార్నింగ్ ఇచ్చిన యువరాజ్
Rohit Sharma:టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ లు భారత జట్టుకు కలిసిఆడారు. ఓ షూట్ లో రోహిత్ కు యువీ వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా హిట్ మ్యాన్ వెల్లడించాడు.

భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేశాయ్ లతో క్లోజ్ గా ఉండే అతి కొద్ది మంది స్నేహితులలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ ఒకడు.. రితికా ను సొంత చెల్లెలా భావిస్తాడు యువీ.
అయితే రితికా-రోహిత్ లు పరిచయం కాకముందు జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి తాజాగా హిట్ మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ విషయంలో యువీ తనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని రోహిత్ అన్నాడు.
హిట్ మ్యాన్ మాట్లాడుతూ.. ‘యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్ లు ఏదో యాడ్ షూట్ చేస్తుండగా నేను అక్కడికి వెళ్లాను. నేనక్కడికి వెళ్లగానే ముందు నాకంటే సీనియర్ ప్లేయర్ అయిన యువరాజ్ దగ్గరికి వెళ్లి హాయ్ చెప్పాను.
సరిగ్గా అదే సమయానికి రితికా కూడా అక్కడే ఉంది. ఆ షూట్ ను రితికానే మేనేజ్ చేస్తున్నది. అయితే నేను యువీకి హాయ్ చెప్పగానే అతడు నాతో.. ‘ఆమె నా చెల్లెలు. ఆమె వైపు చూసినా చంపేస్తా..’ వార్నింగ్ ఇచ్చాడు.
దాంతో నేను పక్కకు వెళ్లి కూర్చున్నాను. రితికా వైపు కోపంగా చూసుకుంటూ.. ఎవరీమే..? యువీ ఎందుకలా అన్నాడు..? అని ఆలోచించడం మొదలుపెట్టాను. యాడ్ షూట్ తర్వాత డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నాతో ‘మీరు చెప్పిందేదీ మైక్ లో రికార్డ్ కాలేదు..’ అని చెప్పాడు. దీంతో నేను అక్కడ్నుంచి వెళ్లడానికి సిద్ధమయ్యాను.
అప్పుడు రితికా నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడింది. నా సమస్యేంటో తెలుసుకుని నాకు సాయం చేసింది. అదే నేను ఆమెతో మాట్లాడిన తొలి మాటలు..’ అని హిట్ మ్యాన్ గుర్తు చేసుకున్నాడు.
2015 లో ఈ జంట పెళ్లి చేసుకుంది. 2018 లో రితికా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక రితికా.. యువీని అన్నలా భావిస్తుంది. రాఖీ పండుగకు యువీకి రాఖీ కట్టడం.. ఇరు కుటుంబాలు నిత్యం కలుసుకోవడం చేస్తూంటాయి.
ఐపీఎల్ తర్వాత కాస్త విరామం తీసుకుంటున్న రోహిత్ శర్మ.. జులైలో ఇంగ్లాండ్ టూర్ కోసం సిద్ధమవుతున్నాడు. విదేశాలలో టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ తొలి సవాల్ ను ఎదుర్కొబోతున్నాడు.