WTC Final 2023: ఓవల్లో గద దక్కించుకునేది వాళ్లే.. సచిన్ కీలక వ్యాఖ్యలు
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఫీవర్ మొదలైంది. నేటి మధ్యాహ్నం భారత్ - ఆస్ట్రేలియా మధ్య తుది పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారననేదానిపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

‘కెన్నింగ్టన్ ఓవల్’ లో నేటి నుంచి జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో గెలిచేది ఎవరు..? భారత్ - ఆస్ట్రేలియా మధ్య సాగే ఈ థ్రిల్లింగ్ ఫైనల్ లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి..? అనేదానిపై క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. తాజాగా దీనిపై టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు.
ఓవల్ లో జరుగబోయే ఫైనల్ టెస్టులో గెలిచేది టీమిండియానేని సచిన్ జోస్యం చెప్పాడు. అందుకు గల కారణాలను కూడా టెండూల్కర్ వివరించాడు. 2021లో ఓవల్ వేదకిగానే ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ ను భారత్ గెలుచుకుందని.. ఆ జ్ఞాపకాలను మరిచిపోకూడదని సచిన్ చెప్పాడు.
ఓ వెబ్ సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ.. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆడుతున్నందుకు భారత్ ఆనందంగా ఉండి ఉంటుంది. ఓవల్ పిచ్ మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది టీమిండియాకు మేలు చేసేదే. భారత్ కు అశ్విన్, జడేజా రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్నారు.
అంతేగాక ఓవల్ భారత్కు కలిసొచ్చే వేదిక. 2021లో భారత జట్టు ఇక్కడ ఇంగ్లాండ్ తో ఆడిన టెస్టులో ఘన విజయం సాధించింది. ఆ జ్ఞాపకాలను టీమిండియా మరువరాదు. అవి జట్టుకు ఉత్సాహాన్నిస్తాయి..’అని సచిన్ తెలిపాడు. గాయంతో జోష్ హెజిల్వుడ్ దూరమైనా ఆ జట్టులో అనుభవజ్ఞులైన పేసర్లు, స్టార్ బ్యాటర్లతో కంగారూలు బలంగా ఉన్నారని సచిన్ తెలిపాడు.
ఆసీస్ టీమ్ అనుభవం, యువతతో సమ్మిళితంగా ఉందని, ఒకసారి మైదానంలోకి దిగితే వారు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారని సచిన్ చెప్పుకొచ్చాడు. జట్టు కూర్పుతో సంబంధం లేకుండా ప్రత్యర్థులకు బలమైన సవాలు విసరడంలో కంగారూలు ఎప్పుడూ ముందుంటారని సచిన్ చెప్పుకొచ్చాడు.
Image credit: PTI
ఇక ఇటీవలే కౌంటీ ఛాంపియన్లో ఇరగదీసిన నయా వాల్ ఛటేశ్వర్ పుజారాతో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ప్రభావం చూపే అవకాశముందని సచిన్ అంచనా వేశాడు. కౌంటీ క్రికెట్ ఆడటం వల్ల వాళ్లకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చిందని తెలిపాడు. కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడి ఆ మ్యాచ్ ప్రాక్టీస్ తో డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఆడుతున్నారని, అది కూడా వారికి ఉపయోగపడొచ్చునని సచిన్ వివరించాడు.