రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ఇలా మారడానికి కారణం అదే, ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే... - ఎమ్మెస్కే ప్రసాద్
రోహిత్ శర్మ, వన్డేల్లో స్టార్ బ్యాట్స్మెన్... వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించడమే కాకుండా, అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన ‘హిట్ మ్యాన్’... టెస్టుల్లో మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. అతని రోహిత్ టెస్టు కెరీర్లో యూటర్న్ తీసుకొచ్చింది మాత్రం తానేనంటున్నాడు మాజీ ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
అప్పుడెప్పుడో 2007లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం ఆరేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 2013లోనే టెస్టుల్లో ఆరంగ్రేటం చేసినా, 2019 నుంచే అతని టెస్టు కెరీర్ కాస్త గాడిలోకి వచ్చింది...
‘రోహిత్ శర్మ చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్. అయితే అతని కెరీర్ గ్రాఫ్ చూస్తూ మాత్రం అందులో చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి. వన్డే కెరీర్ అద్భుతంగా సాగినా, టెస్టుల్లో నిలదొక్కుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడు రోహిత్...
అయితే 2019 వన్డే వరల్డ్కప్లో ఐదు సెంచరీలు నమోదుచేసిన తర్వాత రోహిత్ ఏం చేయగలడో బాగా అర్థమైంది. అందుకే టెస్టుల్లో మళ్లీ అవకాశం ఇవ్వాలని భావించాం...
అయితే ఇంతకుముందు టెస్టుల్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసినప్పుడు రోహిత్ పెద్దగా సక్సెస్ కాలేదు. వన్డే, టీ20ల్లో ఓపెనర్గా ఆకట్టుకున్నాడు. అందుకే టెస్టుల్లో కూడా ఓపెనర్గా ట్రై చేద్దామని నేనే సలహా ఇచ్చాను.
మిడిల్ ఆర్డర్లో ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, అజింకా రహానే రూపంలో సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. అప్పటికే ఓపెనర్లుగా ప్రయత్నించిన ప్లేయర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
మురళీ విజయ్ కూడా చాలారోజులుగా సరిగా రాణించలేకపోతున్నాడు. అందుకే అతని స్థానంలో రోహిత్ శర్మను ఆడించాలని భావించా. 2019లో జరిగిన సౌతాఫ్రికా పర్యటనలో రోహిత్న ఓపెనర్గా దించాం...
నేను రోహిత్ శర్మను టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేయిద్దామని భారత కోచ్ రవిశాస్త్రి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకు సూచించాను. వాళ్లు కూడా నా ప్రతిపాదనను అంగీకరించారు...
మేం ఆశించినట్టుగానే అతను మొదటి టెస్టులోనే రెండు సెంచరీలు చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్..
‘అప్పటికే రోహిత్ శర్మ టెస్టు జట్టుకి దూరమై చాలా ఏళ్లు అవుతోంది. ఓపెనర్గా అతనికి వచ్చిన రెండో అవకాశాన్ని రోహిత్ కరెక్టుగా వాడుకున్నాడు. ఓపెనర్గా డబుల్ సెంచరీ కూడా నమోదుచేశాడు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ చాలా కీలకం అవుతాడని అనుకుంటున్నా. నిజానికి టెస్టుల్లో ఓపెనర్గా అవకాశం రావడం వల్ల అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు’ అంటూ వివరించాడు ఎమ్మెస్కే...
2013లో సచిన్ టెండూల్కర్ ఆడిన చివరి టెస్టు సిరీస్లో వెస్టిండీస్పై కోల్కత్తాతో జరిగిన మ్యాచ్లో ఆరంగ్రేటం చేశాడు రోహిత్ శర్మ. మొదటి మ్యాచ్లోనే 177 పరుగులు చేసి, తొలి మ్యాచ్లో అత్యధిక స్కోరు చేసిన రెండో భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు...
ముంబైలో జరిగిన రెండో టెస్టులో 111 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన రోహిత్ శర్మ, ఆ తర్వాత పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో టెస్టుల్లో స్థానం కోల్పోయిన రోహిత్ శర్మ, 2018-19 దక్షిణాఫ్రికా టూర్లో ఓపెనర్గా చోటు దక్కించుకున్నాడు.
ఓపెనర్గా టెస్టుల్లో రాణిస్తున్న రోహిత్ శర్మకు స్వదేశీ పిచ్లపై అద్భుతమైన యావరేజ్ ఉంది. అయితే విదేశీ పిచ్లపై మాత్రం అతని పర్ఫామెన్స్ ఏ మాత్రం మెరుగ్గా లేదు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ ఎలా రాణిస్తాడో చూడాలి.