రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్.... ఐపీఎల్ 2021 సీజన్ను ఆపడం మంచిదేనంటూ...
ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఐపీఎల్ 2021 సీజన్ను మధ్యలోనే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ మాత్రం ఐపీఎల్ను మధ్యలోనే ఆపి మంచి పనిచేశారని అంటున్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2021 సీజన్ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్, ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు మాత్రమే అందుకుంది. ముఖ్యంగా చెన్నై చెపాక్ స్టేడియంలో ఓ మాదిరి స్కోరు చేయడానికి కూడా బాగా ఇబ్బందిపడ్డారు ముంబై బ్యాట్స్మెన్.
అయితే చెన్నై నుంచి ఢిల్లీ చేరాక ముంబై ఇండియన్స్ మంచి ఫామ్లోకి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అయితే 219 పరుగులను చేధించి, అద్భుత విజయం అందుకుంది ముంబై ఇండియన్స్...
ఐపీఎల్ 2021 సీజన్లోనే బెస్ట్ మ్యాచ్ ఇదే... ఆ తర్వాత సన్రైజర్స్తో మ్యాచ్ ఆడాల్సిన రోజే, ఐపీఎల్ 2021 వాయిదా వేస్తున్నట్టు వార్త వెలువడింది.
ఐపీఎల్ 2021 సీజన్ను మధ్యలోనే ఆపేయడం మంచిదే అంటున్నాడు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. అయితే ఇది నెగిటివ్ వర్షన్లో కాదులెండి, చాలా పాజిటివ్ వర్షన్లోనే...
‘దేశంలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ దేశ ప్రజలకు కాస్త ఉపశమనాన్ని, వినోదాన్ని అందిస్తుందని భావించాం. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
బయో బబుల్లో ఉన్న ప్లేయర్లకే కరోనా సోకింది. ఆటగాళ్లు కరోనా బారిన పడిన తర్వాత మ్యాచులు నిర్వహించడం దాదాపు అసాధ్యం. ఇలాంటి సమయంలో లీగ్ను వాయిదా వేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే సరైంది...
ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో ముంబైకి సపోర్ట్ చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఐపీఎల్ మీ ముందుకి వస్తుంది...
కాబట్టి దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని మెసలుకోండి. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. మనమంతా ఓ కుటుంబంలా వ్యవహారించి, ఈ సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడుకుందాం’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ...
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడడంతో తన కుటుంబంతో కలిసి ఇంటికి చేరుకున్నాడు రోహిత్ శర్మ. కూతురు సమైరాతో కలిసి రోహిత్ శర్మ ఆడుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసింది ఆయన భార్య రితికా శర్మ...