ఆ ఇద్దరూ సెంచరీ చేస్తే చాలు, మ్యాచ్ మనదే... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో...
క్రికెట్లో కూడా సెంటిమెంట్స్ ఎక్కువే. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ సమీపిస్తున్నా కొద్దీ, ఇలాంటి సెంటిమెంట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా రెండు భిన్నమైన సెంటిమెంట్స్ నిజం కావాలని కోరుకుంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...
టెస్టుల్లో లేటుగా ఎంట్రీ ఇచ్చినా, రెండేళ్లుగా ఓపెనర్గానూ అదరగొడుతున్నాడు రోహిత్ శర్మ. ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసిన రోహిత్ శర్మకు ఆరో నెంబర్ బ్యాట్స్మెన్గా మూడు, ఓపెనర్గా నాలుగు సెంచరీలు ఉన్నాయి....
రోహిత్ శర్మ సెంచరీ చేసిన ఏడు టెస్టుల్లోనూ భారత జట్టు భారీ విజయాలు అందుకుంది. ఆఖరిగా చెన్నైలో ఇంగ్లాండ్పై సెంచరీ చేసిన రోహిత్ శర్మ, 161 పరుగులు చేశాడు...
అయితే రోహిత్ శర్మకు ఇప్పటిదాకా విదేశాల్లో ఒక్కటంటే ఒక్క టెస్టు సెంచరీ కూడా లేదు. హిట్ మ్యాన్ సాధించిన టెస్టులన్నీ స్వదేశంలో వచ్చినవే...
అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సౌంతిప్టన్లో 2019 వన్డే వరల్డ్కప్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. దీంతో ఈ పిచ్పై ఆడిన అనుభవం, రోహిత్కి కలిసి వస్తుందని భావిస్తున్నారు అభిమానులు...
భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేకి టెస్టుల్లో 12 సెంచరీలు ఉన్నాయి. వీటిల్లో 9 మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించగా, మూడు మ్యాచులు డ్రాగా ముగిశాయి...
ఆడిలైడ్ ఘోర పరాజయం తర్వాత జరిగిన మెల్బోర్న్ టెస్టులో సెంచరీ చేసి... భారత జట్టు బౌన్స్ బ్యాక్ అవ్వడంలో కీ రోల్ పోషించిన అజింకా రహానే... కీలక సమయాల్లో పరుగులు చేయడంలో స్పెషలిస్ట్...
చివరిగా బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేసిన అజింకా రహానే, 17 టెస్టుల్లో 1095 పరుగులు చేసి వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా ఉన్నాడు.
అజింకా రహానే, రోహిత్ శర్మలలో ఎవరు సెంచరీ చేసినా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు గెలవడం ఖాయమని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
2007 టీ20 వరల్డ్కప్లో భారత జట్టు, టైటిల్ విజేతగా నిలిచింది. ఈ లీగ్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లను ఓడించిన టీమిండియా, టోర్నీలో ఒక్క మ్యాచ్లో ఓడింది అది న్యూజిలాండ్పైనే.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీలోనూ భారత జట్టు ఓడిన ఒకే ఒక్క టెస్టు సిరీస్ న్యూజిలాండ్పైనే. 2007 న్యూజిలాండ్పై ఓడిన తర్వాత టైటిల్ గెలిచినట్టు, ఈసారి కూడా టీమిండియా విజయం సాధిస్తుందని కొందరు అంటున్నారు.
అయితే న్యూజిలాండ్ గెలిచిన ఏకైక, చివరి ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ 2000. ఆ టోర్నీ ఫైనల్లో భారత జట్టును ఓడించి, టైటిల్ కైవసం చేసుకుంది కివీస్. దాంతో అభిమానుల్లో ఆందోళన కూడా మొదలైంది.