మాకు పంత్ లేని లోటు సుస్పష్టం.. కానీ ఏం చేయగలం..? కొత్త కెప్టెన్ వేటలో.. దాదా కామెంట్స్
Rishabh Pant Accident: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
రెండువారాల క్రితం తన తల్లిని కలిసేందుకు ఉత్తరాఖండ్ కు వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబైలో చికిత్స పొందుతున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యుడు దిన్షా పర్దివాలా నేతృత్వంలోని వైద్య బృందం పంత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
పంత్ గాయం నుంచి కోలుకుని మాములు స్థితిని రావడానికి కనీసం ఆరు నుంచి 8 నెలల సమయం పట్టొచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్న మాట. ఈ క్రమంలో పంత్ భారత్ ఆడబోయే కీలక సిరీస్ లతో పాటు ఆసియా కప్ (సెప్టెంబర్), వన్డే ప్రపంచకప్ (అక్టోబర్ - నవంబర్) లలో ఆడేది అనుమానంగానే ఉంది.
తాజాగా పంత్ పై ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇటీవలే డైరక్టర్ ఆఫ్ క్రికెట్ గా నియమితుడైన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ లో తమ జట్టుకు పంత్ లేని లోటు సుస్పష్టంగా తెలుస్తుందని చెప్పాడు.
కోల్కతాలో తనను కలిసిన విలేకరులతో దాదా మాట్లాడుతూ.. ‘అవును.. రిషభ్ పంత్ ఈ ఐపీఎల్ ఆడటం లేదు. అతడు సీజన్ మొత్తానికి మిస్ అవుతాడు. నేను ఢిల్లీ క్యాపిటల్స్ తో టచ్ లో ఉన్నాను. వాళ్లు పంత్ ఆరోగ్యంపై నాకు ఎప్పటికప్పుడూ అప్డేట్స్ ఇస్తున్నారు. పంత్ కు రోడ్డు ప్రమాదం మా జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది..’అని తెలిపాడు.
పంత్ ఐపీఎల్ - 2023కి దూరమైన నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ వేటలో ఉంది. అయితే ఈ విషయంలో త్వరలోనే అభిమానులకు ఢిల్లీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పనుందని దాదా చెప్పినట్టు సమాచారం. ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ జట్టుకు కొత్త కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.
వార్నర్ కు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను నడిపించిన అనుభవముంది. పంత్ లేని లోటును వార్నర్ తీరుస్తాడని ఢిల్లీ భావిస్తున్నది. ఒకవేళ వార్నర్ ను కాదనుకుంటే పృథ్వీ షా గానీ, మిచెల్ మార్ష్ గానీ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికో ఒకరికి సారథ్య పగ్గాలు అప్పజెప్పే అవకాశాలున్నాయి.
ఇక పంత్ ఆరోగ్యం విషయానికొస్తే.. రోడ్డు ప్రమాదం అయ్యాక మూడు రోజుల పాటు డెహ్రాడూన్ లోనే అతడికి చికిత్స అందించగా తర్వాత బీసీసీఐ అతడిని ముంబైకి తరలించింది. ఇటీవలే అతడి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. పంత్ కోలుకున్న అనంతరం అతడిని లండన్ కు పంపించి అక్కడ మరో రెండు సర్జరీలు చేయాల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.