రిషబ్ పంత్ ఆడుతుంటే ఆడమ్ గిల్క్రిస్ట్లా అనిపించాడు... అయినా వృద్ధిమాన్ సాహానే ఆడించాలి...
భారత జట్టులో బుల్లెట్లా దూసుకొచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఆసీస్ పర్యటనలో ఆస్ట్రేలియన్లనే సెడ్జింగ్ చేసి భయపెట్టిన పంత్... మహేంద్ర సింగ్ ధోనీకి సరైన రిప్లేస్మెంట్గా కనిపించాడు. అయితే తన స్థానాని ఢోకా లేదనే ధీమానో, లేక స్వతాహాగా ఉన్న బద్ధకమో తెలీదు కానీ పంత్ నుంచి సరైన ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలమే అయ్యింది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో తన పవర్ చూపించాడు రిషబ్ పంత్.
ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు రిషబ్ పంత్...
రెండో రోజు ఆట ముగిసే ఆఖరి ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్ బాది... సెంచరీ పూర్తిచేసుకున్నాడు పంత్...
నిజానికి హనుమ విహారి సెంచరీ పూర్తి చేసుకునే సమయానికి రిషబ్ పంత్ కేవలం 70 పరుగులతోనే క్రీజులో ఉన్నాడు..
అయితే మూడో రోజు ఉదయం టీమిండియా బ్యాటింగ్ చేయకపోవచ్చని గ్రహించిన రిషబ్ పంత్, ఆఖరి ఓవర్లో చెలరేగి బ్యాటింగ్ చేశాడు...
73 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసిన రిషబ్ పంత్... పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్గా రికార్డు కూడా క్రియేట్ చేశాడు.
రిషబ్ పంత్ ఆటను చూస్తుంటే ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, లెజెండరీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్టలా అనిపించాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
‘ప్రాక్టీస్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ అందరూ టచ్లోకి రావడం చూసి చాలా ఆనందమేసింది... పృథ్వీషా ఫెయిల్ అవుతున్నా మయాంక్ అగర్వాల్ చక్కగా రాణిస్తున్నాడు...
ప్రతీ టెస్టులో సెంచరీ చేయాల్సిన అవసరం లేదు. కానీ టెస్టు మ్యాచుల్లో జట్టు భారీ స్కోరు చేయాలంటే మాత్రం బాధ్యతతో బ్యాటింగ్ చేయాలి. మయాంక్ ఇన్నింగ్స్లో అది స్పష్టంగా కనిపించింది...
రిషబ్ పంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పంత్ క్రీజులోకి వచ్చేసరికి హనుమ విహారి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాంటిది ఆట ముగిసేసరికి ఇద్దరు సెంచరీలు చేశారంటూ అది పంత్ పవర్ ఫుల్ బ్యాటింగ్ కారణంగానే...
రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుంటే ఆడమ్ గిల్క్రిస్ట్లా అనిపించాడు. గిల్లీ కూడా ఇలాగే స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా అందర్నీ బాదేసేవాడు...
అయితే మొదటి టెస్టులో రిషబ్ పంత్ కంటే అనుభవం ఉన్న వృద్ధిమాన్ సాహాను ఆడిస్తే టీమిండియాకు మంచి ఫలితాలు దక్కుతాయి...’ అంటూ వ్యాఖ్యానించాడు ఆకాశ్ చోప్రా.
మొదటి ప్రాక్టీస్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో మిగిలిన బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినప్పుడు హాఫ్ సెంచరీతో రాణించాడు వృద్ధిమాన్ సాహా...