కరోనా బాధితుల కోసం కదిలిన రిషబ్ పంత్... చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ వంతుగా..
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ బాధితుల కోసం భారత యంగ్ వికెట్ కీపర్ తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. సోషల్ మీడియా ద్వారా కరోనా రోగుల సాయంగా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు అందిస్తున్నట్టు తెలిపాడు రిషబ్ పంత్.
‘కరోనాతో దేశ ప్రజలు పడుతున్న బాధలు, ఇబ్బందులు చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. ఏడాది కాలంలో ఈ కరోనా వైరస్ కారణంగా దగ్గరి వాళ్లు కోల్పోవడం చూశాను. వారందరికీ నా సంతాపం తెలియచేస్తున్నా.
ఆట ద్వారా నేను నేర్చుకున్న గొప్ప విషయం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కలిసి పనిచేయడం. ఈ క్లిష్ట సమయాల్లో నిరంతరం శ్రమిస్తున్న ఫ్రంట్లైన్ శ్రామికులను నా సెల్యూట్...
హేమకుంత్ ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లతో కూడిన బెడ్లు, కోవిడ్ రిలీఫ్ కిట్లు, ఇంకా కరోనా బాధితులకు అవసరమైన మందులు అందించబోతున్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న నగరాల్లో సేవలు చేస్తున్న ఈ సంస్థతో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ప్రతీ ఒక్కరూ తమ వంతు సాయం చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్...
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా తమ వంతు సాయంగా తమిళనాడులో కరోనాతో బాధపడుతున్నవారికి 450 ఆక్సిజన్ కాంన్సేటటర్లను పంపించింది.
‘ఐపీఎల్ ప్రారంభం కాకముందు నుంచే మేం ‘మాస్క్ పోడు’ క్యాంపెయిన్ నిర్వహిస్తూ, జనాల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
సీఎస్కే జట్టుపై తమిళనాడు, చెన్నై ప్రజలు చూపించిన ప్రేమాభిమానులకు ఎంత ఇచ్చినా సరిపోదు. అందుకే కష్టకాలంలో వారికి అండగా నిలిచేందుకే ఈ సాయం’ అంటూ చెప్పుకొచ్చాడు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్.
ఐపీఎల్ 2021 సీజన్లో కాశీ విశ్వనాథ్కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కాశీ విశ్వనాథ్తో పాటు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్కి కరోనా సోకింది.