- Home
- Sports
- Cricket
- కనురెప్ప వాల్చకుండా.. మద్దతు తగ్గకుండా..!! ముంబై-ఢిల్లీ పోరును ఆసక్తిగా వీక్షించిన ఆర్సీబీ ఆటగాళ్లు..
కనురెప్ప వాల్చకుండా.. మద్దతు తగ్గకుండా..!! ముంబై-ఢిల్లీ పోరును ఆసక్తిగా వీక్షించిన ఆర్సీబీ ఆటగాళ్లు..
RCB qualifies Playoffs: మైదానంలోకి దిగితే ఢీ అంటే ఢీ అనుకునే ఆటగాళ్లు శనివారం తమ ప్రత్యర్థులకే మద్దతునిచ్చారు. ముంబై-డిల్లీ పోరులో ఆర్సీబీ ఆటగాళ్లు మద్దతునివ్వడమే కాదు.. మ్యాచ్ ఆసాంతం కనురెప్పవాల్చకుండా వీక్షించారు.

ఐపీఎల్-15లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ముగిసిన కీలక పోరులో ముంబై నే విజయం వరించిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ లో ముంబై.. ఢిల్లీకి షాకిచ్చింది.
అయితే ఈ మ్యాచ్ ను ఐపీఎల్ అభిమానులు, ముంబై జట్టు మద్దతుదారులు చూశారో లేదో గానీ ప్రతి ఆర్సీబీ అభిమాని మాత్రం తప్పకుండా చూసుంటాడు. ఆర్సీబీ అభిమానుల సంగతి పక్కనబెడితే ఆ జట్టు ఆటగాళ్లంతా.. ముంబై-ఢిల్లీ పోరును ఆసక్తిగా వీక్షించారు.
ఈ మ్యాచ్ లో ముంబై నెగ్గితేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మాజీ సారథి విరాట్ కోహ్లి లతో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రర్ లు పనులన్నీ పక్కనబెట్టి మ్యాచ్ ను చూశారు.
ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆర్సీబీ.. ఇందుకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. డుప్లెసిస్, కోహ్లి, మ్యాక్సీలు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ ను చూడటమే గాక ఢిల్లీ బ్యాటర్లను ముంబై బౌలర్లు ఔట్ చేస్తుంటే ఎంజాయ్ చేశారు.
ఇక ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మరీ నెమ్మదిగా ఆడటంతో ఆర్సీబీ ఆటగాళ్ల ముఖాల్లో కూడా కాస్త నిరాశ కనిపించింది. కానీ డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్ లు రెచ్చిపోవడంతో ఆర్సీబీ ఆటగాళ్ల ముఖాలు వెలిగిపోయాయి.
మ్యాచ్ లో టిమ్ డేవిడ్ మెరుపులతో ఢిల్లీ ఓటమి ఖరారైన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు పండుగ చేసుకున్నారు. ఢిల్లీ ఓడిన తర్వాత ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. దీంతో విరాట్ కోహ్లి, మ్యాక్సీ తో పాటు పలువురు ఆటగాళ్లు అక్కడే డాన్సులు చేసి తమ ఆనందాన్ని ఇతర ఆటగాళ్లతో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ సీజన్ లో ఆర్సీబీ.. 14 మ్యాచులాడి ఎనిమిదింటిలో గెలిచి.. ఆరింటిలో ఓడి 16 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ విషయంలో మైనస్ లో ఉన్నా ఢిల్లీ కంటే రెండు పాయింట్లు ఎక్కువుండటంతో బెంగళూరు ప్లేఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకుంది.
ప్లేఆఫ్స్ లో బెంగళూరు.. ఈ నెల 25న లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. కోల్కతా వేదికగా సాగే ఈ మ్యాచ్ లో ఓడిన జట్టుకు రెండో అవకాశం ఉండదు. బ్యాగ్ సర్దుకోవడమే..