అశ్విన్ని కావాలనే జట్టు నుంచి తప్పించారు... పాక్ బౌలర్ సయిద్ అజ్మల్ సంచలన ఆరోపణలు...
కొన్నాళ్లుగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కరోనా కష్టకాలంలో కుటుంబానికి తోడుగా ఉండాలనే నిర్ణయంతో ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో నుంచి తప్పుకున్న అశ్విన్, ఆ తర్వాత సంజయ్ మంజ్రేకర్ చేసిన ‘ఆల్టైం గ్రేట్ క్రికెటర్’ కామెంట్స్తో వార్తల్లో నిలిచాడు.
రవిచంద్రన్ అశ్విన్ను ఆల్ టైం గ్రేట్ క్రికెటర్గా ఒప్పుకోవడానికి నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్లపై చాలా చర్చే నడిచింది.
తన దృష్టిలో ఆల్టైం గ్రేట్ క్రికెటర్ అంటే ఎలా ఉండాలో చెబుతూ సంజయ్ మంజ్రేకర్ ట్వీట్లు, దానికి అశ్విన్ రిప్లై... ఇలా ఓ రసవత్తరమైన చర్చ జరిగింది. మరోసారి అశ్విన్ వార్తల్లో నిలిచాడు..
పాక్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్, కావాలనే రవిచంద్రన్ అశ్విన్పై వేటు పడకూడదని ఆరు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉంచారంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై సంచలన ఆరోపణలు చేశాడు.
‘మీరు ఎవ్వరినీ అడగకుండా, ఏ క్రికెట్ ఎక్స్పర్ట్ సలహాలు, సూచనలు తీసుకోకుండా మీకు నచ్చినట్టుగా రూల్స్ అన్నీ మార్చేస్తున్నారు. నేను గత 8 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా... నాకు అన్ని రూల్స్ తెలుసు...
నాపై బ్యాన్ పడిన సమయంలో రవిచంద్రన్ అశ్విన్ను ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉంచారు. ఎందుకు? అంటే అతనిపై బ్యాన్ పడకుండా ఉండాలని, అతని బౌలింగ్ యాక్షన్ను మార్పించారు...
అదే పాకిస్తాన్ బౌలర్పై బ్యాన్ పడినా మీకు ఎలాంటి నష్టం ఉండదు. వాళ్లకి కేవలం బీసీసీఐ ఇచ్చే డబ్బులే కావాలి...’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు సయిద్ అజ్మల్.
2008 నుంచి 2015 వరకూ పాక్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్న సయిద్ అజ్మల్, యాక్షన్ కరెక్టుగా లేదని అతనిపై నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. 2010లో ఎంట్రీ ఇచ్చిన అశ్విన్పై ఇలాంటి వేటు పడకుండా బీసీసీఐ, ఐసీసీ కలిసి జాగ్రత్త పడ్డారని ఆరోపిస్తున్నాడు అజ్మల్...
2011 వన్డే వరల్డ్కప్ను సచిన్ టెండూల్కర్ అవుట్ విషయంలో కూడా ఏదో తప్పు జరిగిందని ఆరోపించిన అజ్మల్, భారత క్రికెట్ బోర్డు తన పరపతి, డబ్బులు వాడి మ్యాచ్ ఫలితాలను మార్చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘అంపైర్ ఆ రోజు సచిన్ టెండూల్కర్ను అవుట్గా ప్రకటించాడు. సచిన్ కూడా అంపైర్ నిర్ణయాన్ని గౌరవించి, క్రీజు వదిలి వెళ్లడానికి రెఢీగా ఉన్నాడు. అయితే ఏదో ఫార్మాలిటీకి డీఆర్ఎస్ కోరుకున్నాడు.
నాకు ఇప్పటికీ అది అవుట్గానే కనిపిస్తోంది. వికెట్లను తాకుతున్నట్టు నాకు అనిపించినప్పుడు, థర్డ్ అంపైర్కి మాత్రం అలా ఎందుకు అనిపించలేదు. టీవీ రిప్లైలో బాల్ సంప్ట్స్ను మిస్ అవుతున్నట్టుగా వచ్చింది...
అసలు ఆ బంతి ఎలా వికెట్లను మిస్ అయ్యిందని కొన్ని వేల మంది నన్ను అడిగారు. నా దగ్గర దానికి సమాధానం లేదు...’ అంటూ ఆరోపించాడు అజ్మల్.
2011 వన్డే వరల్డ్కప్ సెమీ ఫైనల్లో అజ్మల్ బౌలింగ్లో సచిన్ టెండూల్కర్ను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు అంపైర్. అయితే టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించడంతో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది...
అదే మ్యాచ్లో 78 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత జట్టు గెలిచి వరల్డ్కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.