శ్రీలంక టూర్లో భారత జట్టు కోచ్గా రాహుల్ ద్రావిడ్...! సీనియర్లు లేని యువ జట్టును నడిపించేందుకు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు భారత జట్టు, ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత యువకులతో నిండిన మరో జట్టు శ్రీలంకలో టీ20, వన్డే సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేని ఈ యువజట్టును నడిపించేందుకు రాహుల్ ద్రావిడ్ బరిలో దిగుతున్నారట.
షెడ్యూల్ ఇంకా పూర్తిగా ఖరారు కాకపోయినా జూలై 13 నుంచి 27 వరకూ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచుల సిరీస్ జరుగుతుందని సమాచారం. అయితే అధికారికంగా బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
లంక పర్యటనలో భారత జట్టు ఆటగాళ్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఎవరి గదుల్లో వారే పరిమితమై గడుపుతారు. ఆ తర్వాత నాలుగు రోజులు జట్టుతో కలిసి మాట్లాడేందుకు, హోటెల్లో తిరగడానికి అవకాశం ఉంటుంది...
భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అండ్ కో ప్రధాన జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఉంటారు. కాబట్టి యువకులతో నిండిన రెండో జట్టుకి మార్గదర్శకుడిగా భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వ్యవహారించాల్సిందిగా కోరిందట బీసీసీఐ.
ఇప్పటికే భారత్ ఏ జట్టుకి కోచ్గా వ్యవహారించిన అనుభవం కలిగిన రాహుల్ ద్రావిడ్ అయితే లంక టూర్లో భారత జట్టుకి ఎలాంటి ఇబ్బంది రాదని, అదీకాక లంక పర్యటనకి ఎంపికయ్యే అవకాశం ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నటరాజన్ వంటి ప్లేయర్లు ద్రావిడ్ శిక్షణలో రాటుతేలినవారే...
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వ్యవహారిస్తున్న రాహుల్ ద్రావిడ్ సహాయకుడిగా భారత జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్తాడు. భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ లెవెల్ 3 కోచ్ డిప్లోమా సాధించిన పరాస్ మాంబ్రే, ఈ టూర్కి బౌలింగ్ కోచ్గా ఉంటాడు.
ముంబై ఇండియన్స్కి నాలుగేళ్ల పాటు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించిన పరాస్. ఇండియా ఏ, అండర్ 19 క్రికెట్ టీమ్కి బౌలింగ్ కోచ్గా వ్యవహారిస్తున్నాడు.
శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లతో పాటు దేవ్దత్ పడిక్కల్ వంటి కొత్త కుర్రాళ్లకు లంక టూర్లో చోటు దక్కే అవకాశం ఉంటుందని సమాచారం...