టీమిండియాకి ఆడడం కంటే నీకు ఐపీఎల్ ముఖ్యమా... రోహిత్ శర్మపై ఫైర్ అయిన మాజీ కెప్టెన్...
IPL 2020 సీజన్లో అన్నింటికంటే పెద్ద చర్చకు దారి తీసిన అంశం రోహిత్ శర్మ గాయం. అక్టోబర్ 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మ, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచుల్లో బరిలో దిగలేదు. రోహిత్ గాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆస్ట్రేలియా సిరీస్కి కూడా ‘హిట్ మ్యాన్’కి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ.
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో బరిలో దిగాడు రోహిత్ శర్మ... తాను ఫిట్గా ఉన్నానంటూ వ్యాఖ్యానించాడు.
దీంతో రోహిత్ శర్మ గాయం తీవ్రతను అంచనా వేయడంలో బీసీసీఐ ఫిజియోథెరపిస్ట్ లెక్క తప్పిందా? లేక కావాలనే రోహిత్ శర్మను ఆసీస్ టూర్కి దూరంగా ఉంచారా? అనే డిస్కర్షన్ తెరపైకి వచ్చింది.
ఓ వైపు రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని బీసీసీఐ అధికారులు, లేదు ఫిట్గా ఉన్నాడు, త్వరలో బరిలో దిగుతున్నాడంటూ ముంబై ఇండియన్స్ వరుస అప్డేట్స్ ఇచ్చారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు అభిమానులు.
అయితే భారత మాజీ కెప్టెన్, మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్... రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు, ఇలా చేయకుండా ఉండాల్సిందంటూ విమర్శించారు.
‘రోహిత్ శర్మ టీమిండియాకు చాలా ముఖ్యమైన ప్లేయర్. రోహిత్ గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని తేల్చారు ఫిజియో. ఇలాంటి సమయంలో రోహిత్ విశ్రాంతి తీసుకుంటూ త్వరగా కోలుకోవడానికి ప్రయత్నించాలి...
కానీ రోహిత్ శర్మ టీమిండియాకి ఆడడం కంటే, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ఆడడమే ముఖ్యమన్నట్టుగా ప్రవర్తించాడు... భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించడం కంటే ఐపీఎల్లో ఓ జట్టుకి ఆడడమే గొప్పగా భావిస్తున్నాడా...
ఇలాంటి ప్రవర్తన ఏ మాత్రం మంచిది కాదు... రోహిత్ శర్మ కోలుకున్నాడా? లేదా? అన్నది ఫిజియో తేల్చాలి. తనంతట తాను నిర్ణయించుకోకూడదు. మళ్లీ గాయం తిరగబడితే ఎవరిది బాధ్యత...’ అంటూ వ్యాఖ్యానించాడు వెంగ్ సర్కార్.
అయితే వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే. ‘ముంబై ఇండియన్స్కి ఆడే ప్లేయర్, భారత జట్టుకి ఆడలేడా? ఆసీస్ టూర్కి రోహిత్ శర్మను ఎందుకు ఎంపిక చేయలేదు సెలక్టర్లు...’ అంటూ సెలక్టర్ల తీరును తప్పుబట్టారు వీరూ.
గాయం నుంచి కోలుకున్న తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచులో 4 పరుగులకే అవుట్ అయితే, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
దీంతో రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదని, ముంబై ఇండియన్స్ విజయంలో తనవంతు పాత్ర పోషించేందుకు హడావుడిగా బరిలో దిగాడని అంటున్నారు కొందరు నెటిజన్లు. మరి ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడనే దానిపై, ఈ ట్రోల్స్కి ఫుల్స్టాప్ పడుతుందా? కొనసాగుతుందా? అనేది తేలనుంది.