దురదృష్టవశాత్తు బీసీసీఐలో బీజేపీ మైండ్సెట్ ఉంది.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్
నిత్యం భారత క్రికెట్ తో పాటు బీసీసీఐ మీద ఏదో విధంగా బురద జల్లే పని పెట్టుకునే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ అధ్యక్షుడు రమీజ్ రాజా మరోసారి తన నోటికి పనిచెప్పాడు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

పీసీబీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాక ఇటీవల వరుసగా టీవీ ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తలలో వ్యక్తిగా నిలుస్తున్న మాజీ చైర్మన్ రమీజ్ రాజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పదవిలో ఉన్నప్పుడు బీసీసీఐపై నిత్యం ఏదో రకంగా కామెంట్స్ చేసే అలవాటున్న రమీజ్.. తాజాగా మళ్లీ నోటికి పనిచెప్పాడు. బీసీసీఐలో బీజేపీ మైండ్సెట్ ఉందని, అది పాకిస్తాన్ క్రికెట్ వినాశనానికి దారి తీస్తుందని అన్నాడు.
లాహోర్ లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రమీజ్ మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ ఇండియాలో ఏం జరుగుతుందంటే ప్రస్తుతం బీసీసీఐ.. బీజేపీ మైండ్సెట్ తో ఉంది. నేను గతంలో ప్రకటించిన ఆస్తులు పాకిస్తాన్ జూనియర్ లీగ్ (పీజేఎల్), పాకిస్తాన్ ఉమెన్స్ లీగ్ మా స్వయం కృషి. అది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నిధులను సమకూరుస్తుంది.
Image credit: Getty
ఐసీసీ నిధుల నుంచి ఇది మమ్మల్ని పక్కకు నెట్టేస్తుంది. ఐసీసీలో మాకు స్వతంత్రం లేదు. ఎందుకంటే ఐసీసీకి అత్యధికంగా నిధులను సమకూరుస్తున్న దేశం ఇండియా. పాకిస్తాన్ ను చిన్న చూపు చూడాలన్నది భారత్ (బీసీసీఐ) ఆలోచన అయితే మేము ఇక్కడా, అక్కడా ఉండము..’అని వ్యాఖ్యానించాడు.
ప్రత్యక్షంగా పేర్కొనకపోయినా ఈ కామెంట్స్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీ గా ఉన్న జై షా ను ఉద్దేశించే రమీజ్ వ్యాఖ్యానించాడని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇదిలాఉండగా రమీజ్ కామెంట్స్ పై బీసీసీఐ కూడా గట్టిగానే స్పందించింది. అతడు పదవి పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని, రమీజ్ వ్యాఖ్యలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఇన్సైడ్స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ‘అతడు (రమీజ్) తీవ్ర నిరాశలో ఉన్నాడు. అతడి మాటలకు ఎలాంటి లాజిక్ లేదు. క్రికెట్ తో రాజకీయాలను కలపడం చూస్తుంటే బాధేసింది. రమీజ్ ఇలా వ్యాఖ్యానించడం ఇదేం కొత్త కాదు. ఇక్కడితో ముగిసిపోదు. అతడి ప్రకటనల వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు..’అని తెలిపాడు.
ఇదిలాఉండగా.. పీసీబీ నయా చీఫ్ నజమ్ సేథీ.. బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షాతో చర్చించేందుకు సిద్దమవుతున్నాడు. ఆసియా కప్ నిర్వహణలో భాగంగా.. ఈ సమావేశం ఉండనున్నది. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహిస్తేనే తాము పాల్గొంటామని, పాకిస్తాన్ లో అయితే ఆడబోమని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో జై షా తో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్యులను ఒప్పించేందుకు సేథీ ప్రయత్నిస్తున్నారు. దుబాయ్ లో ఈ ఇద్దరూ కలిసే అవకాశమున్నట్టు సమాచారం.