సిరీస్ పాక్దే, కానీ హక్కులు భారత్వి... ఇంగ్లాండ్ వర్సెస్ పాక్ సిరీస్ చూసే అదృష్టం వారికి లేనట్టే..
ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొంటున్న పాక్ క్రికెటర్లు, అది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్కి వెళ్లనున్నారు. అక్కడ ఇంగ్లాండ్ జట్టుతో కలిసి మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది పాక్ క్రికెట్ జట్టు. అయితే ఈ మ్యాచ్లను లైవ్ చూసే అదృష్టం మాత్రం పాక్ ప్రజలకే లేనట్టే...
జూలై 8న మొదలయ్యే పాక్ జట్టు, ఇంగ్లాండ్ పర్యటన, 20 వరకూ జరుగుతుంది. అయితే ఇంగ్లాండ్ వర్సెస్ పాక్ సిరీస్ను పాకిస్తాన్లో ప్రత్యేక్ష ప్రసారం చేయడం లేదని స్పష్టం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. దీనికి కారణం ఇంగ్లాండ్లో మ్యాచుల ప్రసారాలకు సంబంధించిన హక్కులు భారత కంపెనీ చేతుల్లో ఉండడమే...
ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్లను బీసీసీఐ రద్దు చేయడంతో పాక్ క్రికెట్ బోర్డు చాలా నష్టబోయింది. దీంతో భారత్కి సంబంధించిన ఏ మ్యాచులు, పాక్లో ప్రత్యేక్ష ప్రసారం చేయకూడదని నిర్ణయం తీసుకుంది....
భారత బ్రాడ్కాస్టర్స్ స్టార్ ఆసియా చేతుల్లో ఉన్న హక్కులను పొందేందుకు పాకిస్తాన్కి చెందిన పీ టీవీ ఆసక్తి చూపింది. ఇందుకోసం పాకిస్తాన్ క్యాబినేట్ని అనుమతి కోరింది. అయితే పీ టీవీ అభ్యర్థనను పాక్ క్యాబినేట్ తిరస్కరించింది...
‘జమ్మూకాశ్మీర్కి ఉన్న స్వతంత్ర్య ప్రతిపత్తిని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, పాకిస్తాన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పుడు భారతదేశానికి చెందిన కంపెనీ నుంచి హక్కులను పొందడం అంటే, ఆ నిర్ణయాన్ని స్వాగతించినట్టే అవుతుంది...’ అంటూ పాక్ సమాచార, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వ్యాఖ్యానించింది.
దీంతో పాక్ క్రికెట్ జట్టు ఆడే సిరీస్ అయినప్పటికీ లైవ్ మ్యాచ్ చూసే అవకాశాన్ని మాత్రం పాకిస్తాన్ ప్రజలు కోల్పోనున్నారు. వాస్తవానికి జూన్ 23 నుంచే ఈ టూర్ జరగాల్సింది. ఇది ముగిసిన తర్వాత శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ ఆడి భారత్తో టెస్టు సిరీస్ ఆడుతుంది ఇంగ్లాండ్ జట్టు.
అయితే పాక్ సూపర్ లీగ్లో మిగిలిన మ్యాచ్లను పూర్తిచేసేందుకు ఈ సిరీస్ను ముందుకు జరపాల్సిందిగా ఈసీబీని కోరింది పీసీబీ. పాక్ క్రికెట్ బోర్డు అభ్యర్థనకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలపడంతో లేటుగా జూన్ 8న సిరీస్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ ఆడుతుంది. అది ముగిసిన తర్వాత పాక్తో వన్డే, టీ20 సిరీస్ ఆడి... భారత్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది.