అది మీ వల్ల కాదు గానీ టీమిండియాను చూసి నేర్చుకోండి : పాకిస్తాన్కు రమీజ్ రాజా సూచన
స్వదేశంలో ఏ జట్టునైనా ఓడించడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా భారత్ ను భారత్ లో ఓడించడం ప్రత్యర్థి జట్లకు శక్తికి మించిన పని. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి టీమ్ లే ఆ పనిచేయలేక చేతులెత్తేస్తున్నాయి. విదేశాల్లో ప్రదర్శన ఎలా ఉన్నా సొంతగడ్డపై మాత్రం టీమిండియాను ఓడించడం అంత వీజీ కాదు.
గతేడాది భారత్.. స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలను ఓడించింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ లో టీ20, వన్డే సిరీస్ గెలుచుకుంది. తాజాగా ఈ ఏడాది కూడా ఇప్పటికే ఆసియా కప్ విజేతలు శ్రీలంకను టీ20, వన్డేలలో ఓడించింది. ఇటీవలే ముగసిన న్యూజిలాండ్ తో రెండు వన్డేలనూ గెలిచి మరో సిరీస్ సొంతం చేసుకున్నది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా భారత జట్టుపై ప్రశంసలు కురిపంచాడు. స్వదేశంలో భారత్ ను ఓడించడం శక్తికి మించిన పని అని.. ఆ విజయ రహస్యాన్ని ఉపఖండపు దేశాలన్నీ నేర్చుకోవాలని సూచించాడు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఈ విషయంలో ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పాడు.
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత రమీజ్ రాజా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు. ‘ఇండియాను ఇండియాలో ఓడించడం చాలా కష్టంతో కూడుకున్నది. ఉపఖండపు దేశాలు దీనిని నేర్చుకోవాలి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ అయితే తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంది. భారత్ మాదిరిగానే పాక్ కూడా సమర్థవంతమైన టీమ్.
కానీ స్వదేశంలో వారి రికార్డు టీమిండియాకు ఉన్నట్టుగా లేదు. వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో సొంతగడ్డపై భారత్ చెలరేగడం ఆ జట్టుకు కలిసొచ్చేది. న్యూజిలాండ్ అనేది చిన్న జట్టేమీ కాదు. వాళ్లు కూడా టాప్ ర్యాంక్ టీమ్. కానీ వాళ్లను భారత్ అలవోకగా ఓడించింది..
భారత బౌలర్లలో కావాల్సినంత పేస్ లేదు. కానీ వాళ్లు రైట్ ఏరియాస్ లో బంతులను సంధిస్తూ ఫలితాలను రాబడుతున్నారు. ఆ విషయంలో వాళ్లు చాలా ముందున్నారు. ఇక బౌలర్లకు తగినట్టుగా ఫీల్డర్ల సెటప్, అటాకింగ్ ఫీల్డింగ్ బాగుంది. స్లిప్ లో ఫీల్డర్లను మొహరించి అందుకు అనుగుణంగా బంతులు వేయిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం అద్భుతం. భారత స్పిన్నర్లు కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు...’ అని తెలిపాడు.
కాగా.. స్వదేశంలో భారత్ వరుసగా సిరీస్ లను గెలుస్తూ బలమైన టీమ్ గా మారుతుంటే మరోవైపు పాకిస్తాన్ మాత్రం వరుసగా హోం సిరీస్ లను ఓడుతున్నది. గతేడాది ఆస్ట్రేలియాపై టెస్టు, టీ20 సిరీస్, ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అయింది.
ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ ను కాపాడుకుని వన్డే సిరీస్ లో 2-1 తేడాతో ఓడింది. ఈ ఓటముల కారణంగానే రమీజ్ రాజా తన పదవిని కోల్పోయాడు. త్వరలో ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ కూడా తన కెప్టెన్సీని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు.