- Home
- Sports
- Cricket
- మా గ్రౌండ్లు వెడ్డింగ్ హాల్స్గా మారాయి.. ఆ బాధ వర్ణణాతీతం : పాక్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్
మా గ్రౌండ్లు వెడ్డింగ్ హాల్స్గా మారాయి.. ఆ బాధ వర్ణణాతీతం : పాక్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్
పాకిస్తాన్ క్రికెట్ ఇప్పుడు కాస్త మెరుగుపడినా గత దశాబ్దంలో మాత్రం అత్యంత హీన స్థితిని చూసింది. ముఖ్యంగా 2009లో ఉగ్రవాద చర్య తర్వాత అక్కడికి వెళ్లడానికే క్రికెట్ ఆడే దేశాలన్నీ వణికాయి.

గతేడాది టీ20 ప్రపంచకప్ తో పాటు ఈ ఏడాది ఇటీవలే ముగిసిన మెగా టోర్నీలో అంచనాలకు మించి రాణించిన పాకిస్తాన్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. గతేడాది సెమీస్ లో నిష్క్రమించిన ఆ జట్టు ఇప్పుడు ఫైనల్ కు చేరింది. మెగా టోర్నీలలోనే గాక పాకిస్తాన్ స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్ లలో కూడా మెరుగ్గా రాణిస్తున్నది.
ఇప్పుడు పాకిస్తాన్ లో క్రికెట్ కాస్త మెరుగుపడ్డా గత దశాబ్దంలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉండేవి. మరీ ముఖ్యంగా 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్ పై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో పలువురు క్రికెటర్లు గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులతో పాటు ఆరుగురు పోలీసులూ చనిపోయారు. ఈ ఘటన ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురిచేసింది. దీంతో పాకిస్తాన్ కు వెళ్లాలంటేనే క్రికెట్ ఆడే దేశాలు వణికాయి.
ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లో పేరుగాంచిన కరాచీ, ముల్తాన్, రావల్పిండి, పెషావర్ లలోని ప్రముఖ స్టేడియాలన్నీ మూగబోయాయి. తమ దేశానికి క్రికెట్ ఆడే దేశాలు రాకపోవడంతో అక్కడ మైదానాలన్నీ ప్రేక్షకులు లేక వెలవెల్లాడాయి. బోర్డు కూడా పట్టించుకోకపోవడంతో వాటి పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. తాజాగా పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అఫ్రిది మాట్లాడుతూ.. ‘2009లో లంక క్రికెటర్లపై దాడి తర్వాత మా దేశంలో క్రికెట్ స్టేడియాలన్నీ వెడ్డింగ్ హాల్స్ గా మారాయి. మాకు మా దేశంలో గ్రౌండ్ లలో ఆడాలని ఎంతో ఉండేది. కానీ అది జరిగేది కాదు. అప్పట్లో మేం క్రికెట్ ఆడితే స్టేడియాలన్నీ నిండుగా కళకళలాడేవి. ఆ క్రౌడ్ ను మేం చాలా మిస్ అయ్యాం...
అయితే ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తున్నది. ఈ పదేండ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ దశ మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకున మా క్రికెట్ ను బ్రతికించింది. మేం విదేశీ లీగ్ లలో ఆడే సమయంలో ఆయా దేశాల క్రికెటర్లతో మా దేశానికి రావాలని అభ్యర్థించాం. అటువంటి ప్రయత్నాల తర్వాత మళ్లీ మా దేశంలో క్రికెట్ ఆడేందుకు పదేండ్లు పట్టింది..
చాలాకాలం తర్వాత 2019లో శ్రీలంక మా దేశానికి వచ్చింది. ఆ తర్వాత గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లు మా దేశంలో పర్యటించాయి. ఈ మూడు సిరీస్ లను మేం విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు మళ్లీ మా స్టేడియాలను నిండుగా చూడటం సంతోషంగా ఉంది..’అని చెప్పుకొచ్చాడు.