చైర్మన్ నువ్వే కదా భయ్యో.. ఇలాంటి పిచ్లు తయారుచేయిస్తున్నావ్..! రమీజ్ రాజాపై అక్తర్ సెటైర్లు
PAK vs ENG Test: పాకిస్తాన్-ఇంగ్లాండ్ నడుమ రావల్పిండి వేదికగా ముగిసిన తొల టెస్టులో పర్యాటక జట్టు అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రావల్పిండి పిచ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
జీవంలేని రావల్పిండి పిచ్ పై ఫలితాన్ని రాబట్టిన ఇంగ్లాండ్ గెలుపుతో పాకిస్తాన్ మాజీలు పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజాపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఇంత దరిద్రమైన పిచ్ ను తయారుచేయించినందుకు గాను రమీజ్ రాజాతో పాటు పీసీబీపై దుమ్మెత్తిపోస్తున్నారు.
తొలి టెస్టు ముగిసి రెండ్రోజులు పూర్తయిన తర్వాత రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్..రమీజ్ రాజాపై సెటైర్లు సంధించాడు. చైర్మెన్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా పిచ్ గురించి మాట్లాడటం విచిత్రమని... పీసీబీ చీఫ్ ఆయనే అయినప్పుడు ఎలాంటి పిచ్ లు తయారుచేయాలో తెలియదా..? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
పాక్ ఓటమిపై అక్తర్ మాట్లాడుతూ.. ‘వాస్తవానికి ఈ టెస్టులో పాకిస్తాన్ గెలవడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. కానీ వాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేదు. ఇరు జట్ల మధ్య తేడా వాళ ఆటగాళ్ల మైండ్ సెట్. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్ చాలా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆ రిస్క్ చేయలేదు.
ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ టెస్టులలో కూడా బాల్ కు ఒక పరుగు తీసేవిధంగా వ్యూహాలు రూపొందించాడు. వాళ్లు డ్రా కోసం ఆడలేదు. తాము టెస్టు క్రికెట్ ను బ్రతికించేందుకు ఆడుతున్నామని రూట్ చెప్పాడు. కానీ పాకిస్తాన్ అలా చేయలేదు. రోజున్నర ఆటలో సుమారు 100 ఓవర్లు మిగిలున్నా పాకిస్తాన్ విజయం కోసం ఆడుతున్నట్టు కనిపించలేదు.
ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆట చాలా నిరాశపరించింది. నసీమ్ షాతో పాటు కొందరు కుర్రాళ్లు తమ శక్తిమేర రాణించినా ఇంగ్లాండ్ మాత్రం అద్భుతంగా ఆడి విజయం సాధించింది. అందులో సందేహమే లేదు.
ఇక పిచ్ గురించి రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. తాము ఇంకా మంచి పిచ్ తయారుచేసి ఉంటే బాగుండేదని అన్నాడు. కానీ.. రమీజ్ భయ్యా మీరే పీసీబీ చైర్మెన్ కదా. మంచి పిచ్ లు తయారుచేయాల్సిన బాధ్యత మీమీదే ఉంది కదా. అలాంటిది మీరే ఇలా మాట్లాడమేంటి..?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.