న్యూజిలాండ్ను భయపెడుతున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్.... ఆటలో మాత్రం కాదు...
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రూల్స్ అతిక్రమించడంలో, దురుసుగా ప్రవర్తించడంలో, క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా నడుచుకోవడంలో పాక్ క్రికెటర్ల తర్వాతే ఎవ్వరైనా!! తాజాగా సుదీర్ఘ సిరీస్ కోసం న్యూజిలాండ్ చేరిన పాక్ క్రికెట్ టీమ్, న్యూజిలాండ్ దేశాన్నే భయబ్రాంతులకు గురి చేస్తోంది.
న్యూజిలాండ్తో కలిసి మూడు టీ20 మ్యాచులతో పాటు రెండు టెస్టులు ఆడేందుకు ఆ దేశం చేరుకుంది పాక్ క్రికెట్ టీమ్...
న్యూజిలాండ్ చేరుకున్న పాక్ క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయగా వారిలో ఆరుగురికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు చాలా కాలంగా ఈ వైరస్తో ఇబ్బంది పడుతున్నట్టుగా తేలింది...
కరోనా పాజిటివ్ వచ్చిన క్రికెటర్లను న్యూజిలాండ్లోని క్రిస్ట్చర్చిలో ఐసోలేషన్కి తరలించిన కివీస్ క్రికెట్ బోర్డు... మిగిలిన క్రికెటర్లను క్వారంటైన్లో ఉంచింది...
అయితే పాక్ క్రికెటర్లు ఏ మాత్రం బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని, ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలని చెప్పినా పట్టించుకోకుండా ప్రవర్తిస్తోంది పాక్ క్రికెట్ టీమ్...
పాక్ క్రికెటర్లు ప్రోటోకాల్ను అతిక్రమించడంతో కఠినంగా వార్నింగ్ ఇచ్చింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. చెప్పినట్టు వినకపోతే సిరీస్ రద్దు చేసుకుంటామని హెచ్చరించింది.
అయినా పాక్ క్రికెటర్లు వినిపించుకోవడం లేదు. సెల్ఫీలు తీసుకుంటూ, కలిసి కూర్చొని ముచ్ఛట్లు పెడుతూ కనిపించారు...దీంతో కరోనా కేసుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.
ఇప్పటిదాకా పాక్ క్రికెట్ జట్టులో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది. రెండు రోజుల క్రితం ఓ క్రికెటర్కి పాజిటివ్ రాగా, ఇప్పుడు తాజాగా మరో ముగ్గురు కరోనా బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది.
పాక్ క్రికెటర్లు, సిబ్బంది, సహాయక సభ్యులతో కలిపి 53 మంది బృందం న్యూజిలాండ్కి చేరుకున్నారు. వీరిలో 10 మందికి పాజిటివ్ రాగా, వీరి ద్వారా న్యూజిలాండ్లోని క్రిస్ట్చర్చి ఏరియాలో కరోనా విస్తరిస్తోంది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాకముందే కరోనా ఫ్రీ కంట్రీగా ఉన్న న్యూజిలాండ్లో ఇప్పుడు 72 యాక్టివ్ కరోనా కేసులు వెలుగుచూశాయి... వీటిలో పాక్ క్రికెట్ జట్టులోని వారే 10 మంది...
పాక్ క్రికెటర్లు ప్రోటోకాల్ను అనుసరించడం లేదని న్యూజిలాండ్ ఇచ్చిన వార్నింగ్పై సీరియస్ అయ్యాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ‘నేను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకి ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది ఓ క్లబ్ టీమ్ కాదు, పాకిస్థాన్ జాతీయ జట్టు. ఇలా టూర్ రద్దు చేసి వెనక్కి పంపించేస్తామని ఎలా చెబుతారు? మీకు మీరు అవసరం లేదు, మా క్రికెట్ అంతమైపోలేదు, మేం మీ డబ్బు కోసం ఆశగా ఎదురుచూడడం లేదు’ అంటూ తీవ్రంగా స్పందించాడు షోయబ్ అక్తర్.
రోజురోజుకీ కరోనా బారిన పడుతున్న క్రికెటర్ల సంఖ్య పెరుగుతుండడంతో డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కావాల్సిన న్యూజిలాండ్, పాకిస్తాన్ టీ20 సిరీస్ రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పాక్ ప్రవర్తనపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా జింబాబ్వే, ఆఫ్ఘానిస్థాన్ వంటి చిన్నచిన్న జట్లపై క్రికెట్ ఆడుతూ గొప్పలు చెప్పుకుంటున్న పాక్, న్యూజిలాండ్తో ఆడితే చిత్తుగా ఓడిపోవాల్సి ఉంటుందనే ఇలా కావాలని సిరీస్ రద్దు కోసం ప్రయత్నిస్తుందని ట్రోల్స్ వినిపిస్తున్నాయి.