మిమ్మల్ని పట్టించుకునేవాడెవడూ లేడిక్కడ.. పోయి పని చూసుకోండి : ట్రోలర్స్కు భువీ భార్య కౌంటర్
Bhuvneshwar Kumar: కొద్దిరోజులుగా భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడంతో అతడిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ వెళ్లువెత్తుతున్నాయి.
టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేలవ ఫామ్ కారణంగానే భారత్ గత మూడు మ్యాచ్ లలో డెత్ ఓవర్లలో విఫలమైందని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వెళ్లువెత్తుతున్నాయి.
ఆసీస్ తో మ్యాచ్ లో అక్షర్ పటేల్ తప్ప బౌలర్లందరూ విఫలమైనా భువీని టార్గెట్ చేసి ట్రోల్స్ చేయడంపై ఆయన భార్య నుపుర్ నగర్ ఫైర్ అయింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రోలర్స్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ట్రోల్స్ చేసేవాళ్ల గురించి పట్టించుకునేవారెవరూ లేరని, తమను విమర్శించే సమయాన్ని మీ జీవితం బాగు కోసం పెట్టండని ఘాటుగా రాసుకొచ్చింది.
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో నుపుర్ స్పందిస్తూ.. ‘ఈ రోజుల్లో చాలా మంది పనికిరానివారు. వాళ్లు ఏం చేయరు. కానీ ద్వేషం, అసూయ ను వ్యాప్తి చేయడానికి మాత్రం వాళ్ల దగ్గర టైం ఉంది. వారందరికీ నా సలహా ఏంటంటే..
మీ మాటల వల్ల ఇక్కడ ఎవరూ ప్రభావితం కారు. అంతేగాక మీ ఉనికి గురించి కూడా ఎవరూ పట్టించుకోరు. కావున దయచేసి ఇతరుల మీద ద్వేషం చూపే సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం మీద పెట్టండి. అది చాలా కష్టమే అనుకోండి. కానీ ట్రై చేయండి..’ అని పేర్కొంది.
భువనేశ్వర్ గత మూడు మ్యాచ్ లలో డెత్ ఓవర్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. 17, 19వ ఓవర్ బౌలింగ్ చేసి ఆ ఓవర్లలో 15, 16 పరుగులిచ్చాడు.
భువీ ఆటపై సునీల్ గవాస్కర్ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. సీనియర్ బౌలర్ అయిన భువీ ఇలా బౌలింగ్ చేస్తే ఎలా..? అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక సోషల్ మీడియాలో భువీ మీద మీమ్స్ , ట్రోల్స్ హోరెత్తుతున్న నేపథ్యంలో నుపుర్ నగర్ పై విధంగా స్పందించింది.