రోహిత్, కోహ్లీలకు గ్యారంటీ లేదు.. ఏబీ డివిలియర్స్ ఎందుకు ఇలా అన్నారు?
Kohli and Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు. అయితే, ప్రస్తుతం వారి కెరీర్ పై అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలోనే 2027 వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీ అంశం పై ఏబీ డివిలియర్స్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Kohli and Rohit: ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ భారత సీనియర్ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్, విరాట్ లు 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడతారనే గ్యారంటీ లేదని అన్నారు. ఇప్పటికే టెస్టు, టీ20లకు వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.
ఈ ఇద్దరు ఆటగాళ్లు అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ కోసం తిరిగి జట్టులోకి వస్తున్నారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత జట్టులోకి రావడం, అలాగే యువ ఆటగాళ్లకు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో, వారి భవిష్యత్తుపై చర్చ మళ్లీ మొదలైంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ భవిష్యత్తు పై అనిశ్చితి
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో ఏబీ డి విలియర్స్ మాట్లాడుతూ.. “విరాట్, రోహిత్ ఇద్దరూ తదుపరి వరల్డ్ కప్లో ఉంటారనే హామీ లేదు. శుభ్మన్ గిల్ను వన్డే కెప్టెన్గా నియమించడమనేది కూడా దానికి సంకేతంగా ఉంది. గిల్ యువ ఆటగాడు, మంచి ఫార్మ్లో ఉన్నాడు, మంచి లీడర్గా ఎదుగుతున్నాడు. రోహిత్, కోహ్లీ వంటి లెజెండ్లతో కలిసి ఆడటం గిల్కు మంచి అవకాశం” అని అన్నారు.
2027 వరల్డ్ కప్ దూరంలో ఉంది.. ఫామ్ ముఖ్యమన్న డివిలియర్స్
వరల్డ్ కప్ 2027 ఇంకా చాలా సమయం ఉందనీ, అప్పటిరకు ఫామ్ ను నిలుపుకోవడం చాలా ముఖ్యమని డివిలియర్స్ అన్నారు. “ఈ ఇద్దరూ తమ ఫార్మ్ను నిలబెట్టుకోవాలి. 2027 వరల్డ్ కప్ వరకు ఆడటం చాలా కష్టమైన పని అవుతుంది. దూరంలో ఉన్న టోర్నమెంట్కు స్థిరమైన ప్రదర్శనలు అవసరం. వాళ్లు స్కోర్లు చేయాలి, క్రమం తప్పకుండా ఆడాలి. సెలెక్టర్లకు తమ స్థిరమైన ప్రదర్శనలు, ఫామ్ తో ఈ సందేశం ఇవ్వాలి.. లెజెండ్స్ అయినా ఫామ్ కూడా ముఖ్యమే” అని డివిలియర్స్ చెప్పారు.
వన్డేల్లో సూపర్ రికార్డులు సాధించిన రోహిత్, కోహ్లీ
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే ఫార్మాట్ లో అనేక అద్భుతమైన రికార్డులను సాధించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో మెరిశారు. పాకిస్తాన్పై సెంచరీ, ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో 84 పరుగులు చేసి భారత జట్టును ఫైనల్కు చేర్చారు. రోహిత్ శర్మ టోర్నమెంట్ మొత్తం పెద్దగా రాణించకపోయినా, న్యూజిలాండ్పై ఫైనల్లో 76 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే, టైటిల్ గెలిపించిన తర్వాత కూడా రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం గమనార్హం. శుభ్మన్ గిల్ కొత్త వన్డే కెప్టెన్గా ఎంపికయ్యాడు. రోహిత్ కెప్టెన్సీ భారం లేకుండా ఎలా రాణిస్తారో ఈ ఆస్ట్రేలియా సిరీస్లో తెలుస్తుంది.
Kohli and Rohit: వయస్సు, ఫిట్నెస్, భవిష్యత్తు సవాళ్లు
సచిన్ టెండూల్కర్ 40 ఏళ్ల వయస్సులో రిటైర్ అయ్యారు. ఎంఎస్ ధోనీ 39 ఏళ్ల వయస్సులో భారత క్రికెట్కు గుడ్బై చెప్పారు. రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ సమయానికి వరుసగా 40, 39 ఏళ్లకు చేరుకుంటారు. అయితే, కొత్త కెప్టెన్ గిల్ ఆధ్వర్యంలో యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తుండటంతో, సీనియర్లపై పోటీ తీవ్రంగా ఉంది.
ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్, కోహ్లీకి చివరి సిరీస్ కావచ్చని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే, పీటీఐ నివేదిక ప్రకారం కోహ్లీకి 2027 వరల్డ్ కప్ వరకు ఆడే అవకాశముంది, ఎందుకంటే ఆయన ఫిట్నెస్ అత్యుత్తమ స్థాయిలో ఉంది. రోహిత్ కూడా కోచ్ అభిషేక్ నాయర్ సహాయంతో ఫిట్నెస్పై దృష్టి పెడుతున్నప్పటికీ, అది సరిపోతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
భారత క్రికెట్ యంగ్ ప్లేయర్లతో కొత్త దశలోకి అడుగుపెడుతున్న వేళ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు పై చర్చలు మరింత కాకరేపుతున్నాయి.