- Home
- Sports
- Cricket
- తిరిగొస్తున్నారు..! ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్న క్రికెటర్లు.. నిన్న అలీ నేడు బౌల్ట్..
తిరిగొస్తున్నారు..! ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్న క్రికెటర్లు.. నిన్న అలీ నేడు బౌల్ట్..
వయసు భారం, ఫ్రాంచైజీ లీగ్ ల మోజులో పడ్డ మాజీ క్రికెటర్లు తిరిగి జాతీయ జట్టుకు ఆడేందుకు తమ పాత నిర్ణయాలను పక్కనబెడుతున్నారు. కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో వాటిలో ఆడేందుకు రెడీ అవుతున్నారు.

రెండేండ్ల క్రితం టెస్టులలో రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ వెటరన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ.. యాషెస్ సిరీస్ కోసం తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. త్వరలో మొదలుకాబోయే యాషెస్ సిరీస్ లో అతడు ఆడనున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా అతడి రాకను అధికారికంగా ధృవీకరించింది.
ఇక తాజాగా న్యూజిలాండ్ కూడా ఆ జట్టు వెటరన్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ను తిరిగి జట్టులోకి ఆహ్వానించింది. 2002 ఆగస్టులో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చే సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్న బౌల్ట్.. ఇప్పుడు భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో తిరిగి జాతీయ జట్టు తరఫున ఆడనున్నాడు.
Image credit: Getty
ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జెడ్సీ) కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు మాత్రం బౌల్ట్ కు దక్కదు. తాను ఆడిన సమయానికి నగదు అందజేసే విధంగా బౌల్ట్ తో ఒప్పందం కుదిరినట్టు బోర్డు తెలియజేసింది.
2015, 2019 వన్డే వరల్డ్ కప్ లలో కివీస్ తరఫున అత్యద్భుతంగా రాణించిన బౌల్ట్.. 2022 ఆగస్టులో న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని బోర్డుకు చెప్పినా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ లలో ఆడేందుకు గాను బౌల్ట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినా బౌల్ట్.. అక్టోబర్ -నవంబర్ లలో జరిగిన టీ20 వరల్డ్ కప్ - 2022లో కివీస్ తరఫున ఆడాడు. సెమీస్ లో కివీస్.. పాకిస్తాన్ చేతిలో ఓడిన మ్యాచ్ బౌల్ట్ కు చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత అతడు పూర్తిగా లీగులకే ప్రాధాన్యతనిచ్చాడు.
కాగా బౌల్ట్ లో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్న కివీస్ బోర్డు.. ఆ జట్టు సీనియర్ పేసర్ ఆడమ్ మిల్నేకు సెంట్రల్ కాంట్రాక్టును ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు.