ఐపీఎల్ను తాకిన నెపోటిజం సెగ... అర్జున్ టెండూల్కర్కి చోటు దక్కడంపై ట్రోలింగ్...
నెపోటిజం... బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తర్వాత సోషల్ మీడియాలో దీనిపైన తీవ్రమైన చర్చ జరిగింది. టాలెంట్ ఉన్నవారికి కూడా వారుసులకే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయనే బాలీవుడ్ ప్రముఖులపై మాటల దాడికి దిగారు నెటిజన్లు. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నెపోటిజం సెగలు వదిలిపెట్టడం లేదు...
‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ను ఐపీఎల్ మినీ వేలం 2021లో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్...
అయితే 21 ఏళ్ల అర్జున్ టెండూల్కర్, ఇప్పటిదాకా దేశవాళీ క్రికెట్లో పెద్దగా రాణించిందీ లేదు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ఆడిన అర్జున్, బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.
ఫలితంగా విజయ్ హాజారే ట్రోఫీ 2021 సీనియర్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు అర్జున్ టెండూల్కర్. అయితే ఐపీఎల్ వేలానికి ముందు జరిగిన ఓ టోర్నీలో 31 బంతుల్లో 77 పరుగులు చేసిన అర్జున్ టెండూల్కర్, ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదాడు. అదీకాక మూడు వికెట్లు కూడా పడగొట్టాడు.
ఇది ఓ సాధారణ టోర్నీ కావడం వల్ల అర్జున్ టెండూల్కర్ సూపర్ ఇన్నింగ్స్కి పెద్దగా ప్రచారం దక్కలేదు. అంతేకాకుండా ఐపీఎల్లో అర్జున్ టెండూల్కర్ని ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వస్తాయని ముందుగానే ఊహించి, అతనితో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడించి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.
ఐపీఎల్ వేలంలో ముందుగా వేలానికి వస్తే, ట్రోలింగ్ జరిగే అవకాశం ఉందని ఊహించిన ఐపీఎల్ మేనేజ్మెంట్, పక్కా ప్లానింగ్తో అతన్ని వేలంలో ఆఖరి ప్లేయర్గా తీసుకొచ్చాడు. అనుకున్నట్టుగానే ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
‘అర్జున్ టెండూల్కర్ కొన్నాళ్లుగా ముంబై ఇండియన్స్తో ట్రావెల్ అవుతున్నాడు. నెట్స్లో అతని హార్డ్ వర్క్ మేం గమనించాం. యూఏఈలో ముంబైకి నెట్బౌలర్గా వ్యవహారించిన అర్జున్ టెండూల్కర్ స్కిల్స్ మీద ఉన్న నమ్మకంతో అతన్ని కొనుగోలు చేశాం. అంతేకాని సచిన్ టెండూల్కర్ కొడుకు కావడం వల్లే మాత్రం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్థనే.
అయితే నెటిజన్లు మాత్రం అర్జున్ టెండూల్కర్ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. టాలెంట్ ఉన్న ఎందరో యువ క్రికెటర్లు ఉండగా, ఏ రికార్డు లేని అర్జున్ టెండూల్కర్కి అవకాశం దక్కడం కచ్ఛితంగా నెపోటిజమేనంటూ కామెంట్లు, పోస్టులతో రచ్చ చేస్తున్నారు.
కొన్నిరోజుల క్రితం రిహానా ట్వీట్పై స్పందించిన సచిన్ టెండూల్కర్, ‘అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం సహించబోమంటూ’ వేసిన పోస్టు, అర్జున్ టెండూల్కర్పై మరింతగా విమర్శలు రావడానికి కారణమైంది.
కొన్నేళ్ల క్రితం 327 బంతుల్లో 1009 పరుగులు చేసిన ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్ ధన్వాడే ఏమయ్యాడో, ఎటు వెళ్లాడో తెలియదని, సచిన్ టెండూల్కర్ కొడుకు కావడం వల్లే అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్ ఆడబోతున్నాడని, త్వరలోనే భారత జట్టుకి కూడా ఆడతాడని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.