అర్జెంట్గా నువ్వు ఆ బుక్ చదువు.. పంత్కు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ కీలక సూచన
Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కీలక సూచన చేశాడు. పంత్ త్వరగా కోలుకోవాలంటే....

గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిటేషన్ పొందుతున్నాడు. కాలికి శస్త్ర చికిత్సతో నిన్నా మొన్నటివరకూ ఊతకర్ర సాయంతో నడిచిన పంత్.. ఇటీవలే అది కూడా లేకుండా స్వంతంగా నడువగలుగుతున్నాడు.
పంత్ పూర్తిస్థాయిలో కోలుకుని టీమిండియాకు ఆడాలంటే కనీసం ఇంకో నాలుగు నెలలైనా పట్టేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ కూడా ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నది.
తాజాగా పంత్కు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కీలక సూచన చేశాడు. పంత్ త్వరగా కోలుకోవాలంటే అతడు భారత బ్యాడ్మింట్ స్టార్ పుల్లెల గోపీచంద్ పుస్తకం చదవాలని సూచించాడు. ఓ జాతీయ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లు శారీరకంగానే కాదు మానసికంగా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ మేరకు వాళ్లు వారి మైండ్ ను ట్యూన్ చేసుకోవాలి. అలా చేస్తే విజయాలు సాధించగలమని చరిత్రలో మనకు చాలా మంది ప్లేయర్ల విజయాలు చెబుతూనే ఉన్నాయి.
ఇందుకు నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ కథ ఇది. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ కు కొద్దిరోజుల ముందు అతడి మోకాలికి గాయమైంది. దానితో అతడికి ఆపరేషన్ చేయక తప్పనిసరి పరిస్థితి. ఆపరేషన్ సమయంలో గోపీచంద్ తన డాక్టర్ తో ‘నేను ఆపరేషన్ చేయించుకుంటే గతంలో మాదిరిగా జంప్ చేయగలనా..?’ అని అడిగాడు.
అప్పుడు డాక్టర్ గోపీతో ఒక యూరోపియన్ ఫుట్బాల్ ప్లేయర్ 21 సార్లు ఆపరేషన్ చేసుకున్నా మ్యాచ్ లు ఆడుతున్నాడని ఇలాంటి ఘటనలు క్రీడల్లోనూ ఉన్నాయని అతడికి చెప్పాడు. ఇది గోపీకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆపరేషన్ అయిన కొద్దిరోజులకే గోపీ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ లో ఆడి విజేతగా నిలిచాడు. చరిత్రలో అటువంటి విజయగాథలు చాలా ఉన్నాయి. పంత్ కూడా గోపీ పుస్తకంలోని ఆ పేజీ చదవాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందాలి...’అని సూచించాడు.