ముంబై ఇండియన్స్పై రివెంజ్ ఆలోచన లేదు, ఎందుకంటే... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ అత్యంత సక్సెస్ఫుల్ అయిన ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, ‘మ్యాచ్ ఆఫ్ ది సీజన్’గా ఈ ఫైట్ను అభివర్ణిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఐపీఎల్ 2021 సీజన్లో మొదటి మ్యాచ్ పరాభవం తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్, ఆరింట్లో మూడు విజయాలు మాత్రమే అందుకున్న ముంబై మధ్య మ్యాచ్కి ఇంత హైప్ రావడానికి కారణం ఈ రెండు జట్ల మధ్య ఉన్న రికార్డులే.
ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్ అయితే, మూడు సార్లు టైటిల్ గెలిచి రెండో స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే గత సీజన్లో చెన్నై పర్ఫామెన్స్ ఆశించిన స్థాయిలో లేదు.
వరుసగా మ్యాచులు ఓడిపోయి, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈసారి సీఎస్కే అత్యంత పటిష్టంగా కనిపిస్తుండడమే కాదు, రెట్టింపు కసితో మ్యాచులు గెలుస్తోంది...
ఐదు మ్యాచుల్లో వరుసగా పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జైత్ర యాత్రకు బ్రేక్ చేయగల సత్తా ఉన్న ముంబై ఇండియన్స్. అయితే ఈ సీజన్లో వారి ఆట ఆశించిన స్థాయిలో లేదు. చెన్నై వేదికగా ఐదింట్లో రెండే విజయాలు అందుకుంది ముంబై ఇండియన్స్.
ఐపీఎల్ 2019 సీజన్లో ముంబై ఇండియన్స్ చేతిలో నాలుగుసార్లు ఓటమి చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్. ఫైనల్ మ్యాచ్లో అయితే ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడి టైటిల్ చేజార్చుకుంది.
2020 సీజన్లో ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది చెన్నై సూపర్ కింగ్స్...
ఇప్పుడు ముంబై ఇండియన్స్పై సీఎస్కే ప్రతీకారం తీర్చుకోబోతుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ధోనీ మాత్రం క్రికెట్లో రివెంజ్ అనే మాటకు స్థానం లేదని అంటున్నారు...
‘ముంబై ఇండియన్స్పై మాకు ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవు. ఎందుకంటే క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్. మేం జెంటిల్మెన్స్లా ఉండాలని అనుకుంటున్నాం.... కాబట్టి ఆటపైనే ఫోకస్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ.
ఆరు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో గెలిచిన ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో ఓడితే నాలుగో ఓటమి ఖాతాలో చేరుతుంది. ఫ్లేఆఫ్ చేరాలంటే మిగిలిన మ్యాచుల్లో కనీసం నాలుగు మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
ఎలా చూసినా నేటి మ్యాచ్లో గెలవడం ముంబై ఇండియన్స్ చాలా అవసరం. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ నేటి మ్యాచ్లో ఓడినా, రన్రేట్ కారణంగా టాప్లోనే కొనసాగుతుంది.