మహ్మద్ షమీని వరల్డ్ కప్ ఆడించే ఉద్దేశం లేదా? 6 నెలలుగా ఒక్క వన్డే కూడా ఆడకుండా...
ఆసియా కప్ 2023 టోర్నీని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రిపరేషన్ టోర్నీగా చూస్తోంది టీమిండియా... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ తర్వాత వెస్టిండీస్ టూర్కి, అటు నుంచి ఐర్లాండ్కి వెళ్లిన భారత జట్టు... లంకలో ఆసియా కప్ ఆడుతోంది..

పాకిస్తాన్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. బ్యాటింగ్ ఆల్రౌండర్గా శార్దూల్ ఠాకూర్ని తుది జట్టులోకి తెచ్చిన టీమిండియా మేనేజ్మెంట్, మహ్మద్ షమీ రిజర్వు బెంచ్లో కూర్చోబెట్టింది..
వెస్టిండీస్ టూర్లో టెస్టు, వన్డే సిరీస్లో కూడా మహ్మద్ షమీ ఆడలేదు. 2023 మార్చిలో ఆస్ట్రేలియాపై ఆఖరి వన్డే ఆడిన మహ్మద్ షమీ, ఆరు నెలలుగా వన్డే ఫార్మాట్కి దూరంగా ఉన్నాడు. మూడు నెలలుగా క్రికెట్కి దూరంగా ఉన్నాడు..
ఐపీఎల్ 2023 సీజన్లో 27 వికెట్లు తీసి ‘పర్పుల్ క్యాప్’ గెలిచిన మహ్మద్ షమీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు..
చూస్తుంటే బ్యాటింగ్ డెప్త్ కోసం మహ్మద్ షమీని రిజర్వు బెంచ్కే పరిమితం చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సిరాజ్, బుమ్రా ఇద్దరిలో ఎవరైనా గాయపడితే, లేదా శార్దూల్ ఠాకూర్ వరుసగా అట్టర్ ఫ్లాప్ అయితే మహ్మద్ షమీని తుది జట్టులోకి తేవాలనేది మేనేజ్మెంట్ ఆలోచన.
మహ్మద్ షమీని ఇలా పక్కనబెట్టి, నేరుగా ఐసీసీ టోర్నీల్లో ఆడించడం ఇదేం మొదటిసారి కాదు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత మహ్మద్ షమీ, 11 నెలల పాటు టీ20 ఫార్మాట్కి దూరంగా ఉన్నాడు. మహ్మద్ షమీపై వర్క్ లోడ్ తగ్గించి, వన్డే వరల్డ్ కప్కి సిద్ధం చేసేందుకే అతన్ని టీ20ల నుంచి తప్పించినట్టు ప్రకటించింది బీసీసీఐ..
అయితే జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ ఇద్దరూ గాయపడడంతో మరో గత్యంతరం లేక టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ద్వారా మళ్లీ టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చాడు మహ్మద్ షమీ. అయితే పొట్టి ప్రపంచ కప్లో షమీ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ అయితే రాలేదు..
Mohammad Shami
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మహ్మద్ షమీ కీ బౌలర్. బుమ్రాతో ఓపెనింగ్ బౌలింగ్ చేసేందుకు లేదా మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి రన్ రేట్ కంట్రోల్ చేసేందుకు సీనియర్ బౌలర్ షమీ సేవలు చాలా అవసరం. అయితే టీమిండియా మాత్రం బ్యాటింగ్ డెప్త్ని పెంచేందుకు బౌలింగ్ డెప్త్ని తగ్గిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ఓటమికి బౌలింగ్ వైఫల్యమే కారణం. 2021లో పాకిస్తాన్తో మ్యాచ్లో, 2022 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్పై ఒక్క వికెట్ తీయలేకపోయారు భారత బౌలర్లు.. అయినా టీమిండియా ఆలోచన మాత్రం మారడం లేదు.