Ashes 2023: మనసు మార్చుకున్న మోయిన్ అలీ.. జట్టును మార్చిన ఇంగ్లాండ్
Ashes 2023: ఇంగ్లాండ్ వెటరన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ మనసు మార్చుకున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
రెండేండ్ల క్రితం టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఇంగ్లాండ్ వెటరన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. టెస్టు రిటైర్మెంట్ ను తాను వెనక్కి తీసుకున్నాడు. యాషెస్ -2023 కోసం అలీ మనసు మార్చుకుని మరోసారి రెడ్ బాల్ క్రికెట్ ఆడనున్నాడు.
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 16 నుంచి యాషెస్ సిరీస్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇదివరకే 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ కూడా ఉన్నాడు. కానీ ఐర్లాండ్ తో టెస్టు ముగిసిన తర్వాత లీచ్.. వెన్ను గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
దీంతో ఇంగ్లాండ్ కు మరో స్పిన్నర్ ను వెతకాల్సిన పని పడింది. ఈసీబీ ఈ మేరకు మోయిన్ అలీని సంప్రదించింది. తన టెస్ట్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని కోరింది. ఇంగ్లాండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కూడా రంగంలోకి దిగి అలీని ఒప్పించాడు.
అలీ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయంపై ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో స్పందిస్తూ.. తిరిగి టెస్టులు ఆడేందుకు సిద్ధమయ్యానని ఖాయం చేశాడు. దీంతో ఈసీబీ జట్టును మార్చింది. లీచ్ స్థానంలో అలీని చేర్చింది.
మోయిన్ అలీ తన కెరీర్ లో 64 టెస్టులు ఆడి 2,914 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్ లో అలీ.. 195 వికెట్లు పడగొట్టడం విశేషం. 2021 సెప్టెంబర్ లో భారత్ తో నాలుగో టెస్టు ముగిసిన తర్వాత అలీ రిటైర్మెంట్ ప్రకటించాడు.
యాషెస్ సిరీస్ లో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో, జో రూట్, జేమ్స్ అండర్సన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, బెన్ డకెట్, జాక్ క్రాలే, మాథ్యూ పాట్స్, ఓలీ రాబిన్సన్, డాన్ లారెన్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, జోష్ టంగ్