భారత్తో టీ20 సిరీస్కు కేన్ మామ దూరం.. కొత్త కెప్టెన్ ఇతడే..
INDvsNZ: స్వదేశంలో ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు.. తర్వాత న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ పర్యటనకు కివీస్ సారథి కేన్ విలియమ్సన్ అందుబాటులో లేడు.
ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్.. అది ముగిసినవెంటనే భారత్ టూర్ కు రానుంది. ఈ టూర్ లో కివీస్.. భారత్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే పాకిస్తాన్ టూర్ ముగిసిన తర్వాత ఆ జట్టు వైట్ బాల్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. తిరిగి న్యూజిలాండ్ కే వెళ్లనున్నాడు.
మరోవైపు ఇటీవలే టెస్టు సారథిగా నియమితుడైన టిమ్ సౌధీ కూడా పాక్ టూర్ నుంచి స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. కివీస్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్లిద్దరికీ న్యూజిలాండ్ క్రికెట్ రెస్ట్ ఇచ్చింది. దీంతో కివీస్ కు వన్డే, టీ20లకు కొత్త కెప్టెన్ల అవసరం వచ్చింది.
భారత్ తో వన్డేలకు టామ్ లాథమ్ సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20లకు మాత్రం వెటరన్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఈ మేరకు కివీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
కొత్తగా జట్టులోకి దేశవాళీలో అదరగొడుతున్న బెన్ లిస్టర్ ను స్క్వాడ్ లో చేర్చింది. గతేడాది న్యూజిలాండ్ ఏ జట్టు భారత్ లో పర్యటించినప్పుడు కూడా లిస్టర్ మెరుగ్గా రాణించాడు. దీంతో అతడికి తుది జట్టులో కూడా చోటు దక్కచ్చని సమాచారం.
భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు : మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖెల్ బ్రాస్వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లెవర్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫ్ఫీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రిప్పన్, హెన్రీ షిప్లే, ఇష్ సోధి, బ్లేర్ టిక్నర్
ఇండియా - న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్ : జనవరి 18న తొలి వన్డే (హైదరాబాద్), 21న రెండో వన్డే (రాయ్పూర్), 24న మూడో వన్డే (ఇండోర్), జనవరి 27న తొలి టీ20 (రాంచీ), 29న రెండో టీ20 (లక్నో), ఫిబ్రవరి 01న మూడో టీ20 (అహ్మదాబాద్)