కెఎల్ రాహుల్ ఆడకపోతే! టీమ్ కాంబినేషన్లో ఇన్ని సమస్యలా... శుబ్మన్ గిల్ పరిస్థితి ఏంటి?
ఆసియా కప్ 2023 టోర్నీ కోసం శ్రీలంక చేరుకుంది భారత జట్టు. సెప్టెంబర్ 2న కెండీలో పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడే టీమిండియా, సెప్టెంబర్ 4న నేపాల్తో తలబడుతుంది. అయితే మొదటి రెండు మ్యాచుల్లో కెఎల్ రాహుల్ అందుబాటులో ఉండడం లేదని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రకటించాడు..
కెఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియాకి కొత్త తలనొప్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా టీమ్ కాంబినేషన్ని కొనసాగించడం చాలా కష్టంగా మారుతుంది. కొన్నాళ్లుగా రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు..
రోహిత్ శర్మ ఆడని మ్యాచుల్లో శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ కలిసి ఓపెనింగ్ చేశారు. ఓపెనర్గా ఇషాన్ కిషన్కి మంచి రికార్డు ఉంది. వెస్టిండీస్ టూర్లో జరిగిన వన్డే సిరీస్లోనూ ఓపెనర్గా వచ్చి హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదాడు ఇషాన్ కిషన్...
వన్డేల్లో ఓపెనర్గా డబుల్ సెంచరీ బాదిన తర్వాత కూడా శుబ్మన్ గిల్ కారణంగా రిజర్వు బెంచ్కే పరిమితం అయ్యాడు ఇషాన్ కిషన్. కెఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ని తప్పక ఆడించాల్సిన పరిస్థితి..
‘కెఎల్ రాహుల్, మొదటి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో నాకైతే ఐదు ప్రశ్నలు వెంటాడుతున్నాయి? ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడా? అలా అతను ఓపెనర్గా వస్తే, శుబ్మన్ గిల్ ఏ ప్లేస్లో ఆడతాడు?
ఒకవేళ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ఓపెనింగ్ చేసి, ఇషాన్ కిషన్ని వన్డౌన్లో పంపిస్తారా? అలా చేస్తే విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా అక్కడ బ్యాటింగ్ చేసే శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానానికి వెళ్తాడు..
రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ఓపెనింగ్ చేసి, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో పంపి, శ్రేయాస్ అయ్యర్ తర్వాత ఐదో స్థానంలో ఇషాన్ కిషన్ని ఆడిస్తారా? లేక శుబ్మన్ గిల్ని రిజర్వు బెంచ్లో కూర్చోబెట్టి, తిలక్ వర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ని ఐదో స్థానంలో ఆడిస్తారా?’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా..