జింబాబ్వేతో సిరీస్కు మరో కెప్టెన్.. ధావన్కు మొండిచేయి..!
India Tour Of Zimbabwe: ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు విండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడిన తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది.

కెప్టెన్ల మార్పుపై వరుస విమర్శలు వస్తున్నా బీసీసీఐ పట్టించుకోవడం లేదు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక ‘సిరీస్ కు ఒక సారథి’ అన్న ఫార్ములాను పాటిస్తున్న సెలక్టర్లు అదే పద్ధతిని కంటిన్యూ చేయనున్నారు.
కోహ్లీ తర్వాత పూర్తి స్థాయి సారథిగా నియమితుడైన రోహిత్ శర్మ.. ఇప్పటివరకు ఆ బాధ్యతలను ‘పూర్తిస్థాయిలో’ మాత్రం నిర్వహించలేకపోతున్నాడు. తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నా అభిమానులతో పాటు క్రికెట్ పండితుల్లో ఇది లేని పోని అనుమానాలకు తావిస్తున్నది.
ఇప్పటికే ఐపీఎల్ ముగిసిన తర్వాత నాలుగు సిరీస్ లు కూడా జరుగకముందే టీమిండియాకు నలుగురు సారథులు మారారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు రిషభ్ పంత్ సారథిగా ఉండగా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో రీషెడ్యూల్డ్ టెస్టుకు బుమ్రా.. టీ20, వన్డేలకు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ మధ్యలో ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచుల టీ20 సిరీస్ కు హార్ధిక్ పాండ్యా సారథిగా పనిచేశాడు.
Image credit: Getty
ఇక ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక శుక్రవారం నుంచి విండీస్ తో ప్రారంభం కాబోయే మూడు మ్యాచుల వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ నాయకుడి అవతారం ఎత్తనుండగా.. ఆ తర్వాత టీ20లకు మళ్లీ రోహిత్ శర్మ జట్టుతో కలుస్తాడు.
విండీస్ పర్యటన ముగిశాక భారత జట్టు జింబాబ్వే తో మూడు వన్డేలు ఆడేందుకు వెళ్లనుంది. ఈ సిరీస్ కు కూడా ధావన్ నే సారథిగా కొనసాగిస్తారని అంతా అనుకున్నా సెలక్టర్లు మాత్రం మళ్లీ పాత పద్ధతినే ఫాలో అయ్యారు.
‘సిరీస్ కు ఒక సారథి’ ఫార్ములాలో భాగంగా జింబాబ్వే సిరీస్ కు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు గాయపడి ఇటీవలే జర్మనీ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకుని వచ్చిన రాహుల్.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కూడా కఠోర శిక్షణ ముగించుకున్నాడని సమాచారం.
అతడు త్వరలోనే ఫిట్నెస్ టెస్టుకు హాజరుకానున్నట్టు తెలుస్తున్నది. ఇది క్లీయర్ చేసుకుని వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు ఎంపికకావాలనే పట్టుదలలో రాహుల్ ఉన్నాడు.
రాహుల్ వస్తే ఎలాగూ అతడే రోహిత్ కు డిప్యూటీ కావడంతో మళ్లీ ధావన్ ను ఆప్షన్ గా పెట్టుకోవడం కంటే రాహుల్ నే కొనసాగించడం బెటరనే అభిప్రాయంలో సెలక్టర్లు ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.