ఆసియా కప్ ఆరంభానికి ముందే టీమిండియా షాక్... మొదటి 2 మ్యాచులకు కెఎల్ రాహుల్ దూరం..
ఆసియా కప్ 2023 టోర్నీకి టీమిండియా ప్రాక్టీస్ ముగిసింది. బెంగళూరులో 6 రోజుల క్యాంపు నిర్వహించిన బీసీసీఐ, ఆగస్టు 29 రాత్రి, టీమ్ని శ్రీలంకకు పంపనుంది. 17 మంది ప్లేయర్లతో పాటు స్టాండ్ బై ప్లేయర్గా సంజూ శాంసన్, లంకకు వెళ్లబోతున్నాడు..
శ్రీలంకకు బయలుదేరి వెళ్లేముందు మీడియా కాన్ఫిరెన్స్లో పాల్గొన్నాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. కెఎల్ రాహుల్ గాయం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ద్రావిడ్.
‘కెఎల్ రాహుల్ వేగంగా కోలుకుంటున్నాడు. అయితే పాకిస్తాన్, నేపాల్తో జరిగే మొదటి రెండు మ్యాచుల్లో మాత్రం అతను అందుబాటులో ఉండడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడించడానికి అతన్ని సిద్ధం చేస్తున్నాం..
కొన్నాళ్లుగా టీమిండియా చేస్తున్న ప్రయోగాల గురించి చాలా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఈ రకమైన ప్రయోగాలు అవసరమా? అనే కామెంట్స్ నేను కూడా విన్నాను. అయితే 18-20 నెలల క్రితం కూడా మాకు, వన్డే వరల్డ్ కప్లో ఏ టీమ్ని ఆడించాలనే విషయంలో పూర్తి క్లారిటీ ఉంది..
అయితే కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ గాయపడడంతో ఆ ప్లేస్లో సరైన ప్లేయర్లని వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ప్రయోగాలు చేయక తప్పలేదు..
రిషబ్ పంత్ అందుబాటులో ఉండి ఉంటే, చాలా సమస్యలకు పరిష్కారం దొరికి ఉండేది. అయితే అతనికి కారు ప్రమాదం జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు కదా! శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్గా ఉన్నాడు. మొదటి మ్యాచ్ నుంచే బరిలో దిగుతాడు..
కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించినా, వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనే అతనికి మొదటి 2 మ్యాచుల్లో రెస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అతని ప్లేస్లో ఇషాన్ కిషన్ మొదటి 2 మ్యాచులు ఆడతాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్..