కపిల్దేవ్ ఆల్టైమ్ బెస్ట్ వన్డే టీమ్ ఇదే... రోహిత్ శర్మకు నో ఛాన్స్... కోహ్లీ, సచిన్తో పాటు...
భారత జట్టుకి మొట్టమొదటి వన్డే వరల్డ్కప్ అందించిన కెప్టెన్ కపిల్దేవ్... తన ఆల్టైమ్ బెస్ట్ భారత వన్డే టీమ్ను ప్రకటించాడు. భారత క్రికెట్ చరిత్రలో పదకొండు మంది బెస్ట్ క్రికెటర్లను తన జట్టుగా ఎంచుకున్నాడు కపిల్దేవ్. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్ శర్మకు కపిల్ దేవ్ ప్రకటించిన బెస్ట్ ఎలెవన్ టీమ్లో చోటు దక్కకపోవడం విశేషం. కపిల్దేవ్ ప్రకటించిన ఆల్టైం బెస్ట్ వన్డే టీమ్ ఎలెవన్లో ఎవరెవరు ఉన్నారంటే...
సచిన్ టెండూల్కర్: వన్డేల్లో 49 సెంచరీలతో పాటు 18 వేలకు పైగా పరుగులు చేసిన ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్కి కపిల్దేవ్ వన్డే టీమ్లో చోటు దక్కింది...
వీరేంద్ర సెహ్వాగ్: ధనాధన్ ఆటతీరుతో క్రికెట్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సూపర్ మ్యాన్ వీరేంద్ర సెహ్వాగ్కి కూడా కపిల్దేవ్ ఆల్టైమ్ బెస్ట్ వన్డే టీమ్లో చోటు దక్కింది. 251 వన్డేల్లో 15 సెంచరీలతో 8273 పరుగులు చేసిన సెహ్వాగ్ను సచిన్తో కలిసి ఓపెనర్గా ఎంచుకున్నాడు కపిల్.
విరాట్ కోహ్లీ: సచిన్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్న భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీని వన్డౌన్ బ్యాట్స్మెన్గా ఎంచుకున్నాడు కపిల్ దేవ్.
ఇప్పటికే వన్డేల్లో 43 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా నిలిచాడు.
రాహుల్ ద్రావిడ్: భారత జట్టుకు ఆపద్భాంధవుడిగా గుర్తింపు పొందిన రాహుల్ ద్రావిడ్ను టూ డౌన్ బ్యాట్స్మెన్గా ఎంచుకున్నాడు కపిల్ దేవ్. 12 సెంచరీలతో 10 వేలకు పైగా పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్, భారత క్రికెట్లో అతిగొప్ప క్రికెటర్లలో ఒకటిగా కీర్తించబడుతున్నాడు.
యువరాజ్ సింగ్: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు క్రియేట్ చేసిన యువరాజ్ సింగ్... భారత జట్టుకి రెండు వరల్డ్కప్స్ దక్కడంలో కీ రోల్ పోషించాడు. 304 వన్డేలు ఆడిన యువరాజ్ సింగ్ 8701 పరుగులు చేసి కపిల్ దేవ్ ఆల్టైమ్ బెస్ట్ వన్డే టీమ్లో చోటు దక్కించుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ: భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీకి పోటీ వచ్చే వికెట్ కీపర్ లేడని చెప్పిన కపిల్ దేవ్, మాహీకి తన బెస్ట్ ఎలెవన్ జట్టులో కీపర్గా ఎంచుకున్నాడు.
350 వన్డేలు ఆడిన ధోనీ, 10 వేలకు పైగా పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వస్తూ 10 వేలకి పైగా పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్గా రికార్డు సృష్టించిన ధోనీకి తన జట్టుకి కెప్టెన్గా ఎంచుకున్నాడు కపిల్ దేవ్.
అనిల్ కుంబ్లే: భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు భారత మాజీ స్పిన్నర్, కోచ్ అనిల్ కుంబ్లే. 271 వన్డేల్లో 337 వికెట్లు తీసిన కుంబ్లేకి కూడా కపిల్ దేవ్ ఆల్టైం బెస్ట్ వన్డే టీమ్లో చోటు దక్కింది.
హర్భజన్ సింగ్: 236 వన్డేల్లో 269 వికెట్లు తీసిన భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్కి కూడా కపిల్ దేవ్ ఆల్టైం బెస్ట్ వన్టే టీమ్లో చోటు దక్కింది...
జవగళ్ శ్రీనాథ్: కపిల్దేవ్ కెప్టెన్సీలో బౌలర్గా రాణించిన జవగళ్ శ్రీనాథ్కి తన ఆల్టైం బెస్ట్ వన్డే టీమ్లో చోటు కల్పించాడు ఈ మాజీ కెప్టెన్. 229 వన్డేల్లో 315 వికెట్లు తీశాడు శ్రీనాథ్.
జహీర్ ఖాన్: భారత జట్టులో బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు జహీర్ ఖాన్. 200 వన్డేల్లో 282 వికెట్లు తీసిన జహీర్ ఖాన్కి కూడా కపిల్ దేవ్ బెస్ట్ టీమ్లో చోటు దక్కింది...
జస్ప్రిత్ బుమ్రా: కొంతకాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు పేసర్ బుమ్రా. 58 వన్డేల్లో 104 వికెట్లు తీసిన బుమ్రాకి కూడా కపిల్దేవ్ ఆల్టైమ్ బెస్ట్ వన్డే జట్టులో చోటు దక్కింది...
మొత్తంగా సచిన్, సెహ్వాగ్, విరాట్ కోహ్లీలతో కపిల్ దేవ్ టీమిండియా ఆల్టైం బెస్ట్ ఎలెవన్ టీమ్ టాపార్డర్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది.
మిడిల్ ఆర్డర్లో రాహుల్ ద్రావిడ్లాంటి క్లాస్ ప్లేయర్, యువరాజ్ లాంటి ఆల్రౌండర్, ధోనీ లాంటి ఫినిషర్ కూడా ఉన్నాడు...
అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లాంటి మేటి స్పిన్నర్లతో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంటే...
శ్రీనాథ్, జహీర్ ఖాన్, బుమ్రాలతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత దృఢంగా కనిపిస్తోంది...
అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మకు కూడా ఈ జట్టులో చోటు కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు కొందరు ‘హిట్ మ్యాన్’ అభిమానులు.